రామాయణ: రెండు పాత్రల్లో రణ్బీర్.. ఏయే పాత్రలంటే..
ABN , Publish Date - Apr 04 , 2026 | 04:02 PM
బాలీవుడ్లో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘రామాయణ’. తాజాగా నిర్వహించిన కార్యక్రమంలో ఈ సినిమా గురించి రణ్బీర్ ఓ ఆసక్తికర విషయం చెప్పారు.
బాలీవుడ్లో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘రామాయణ’ (Ramayana). రాముడిగా రణ్బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి నటిస్తున్నారు. నితేష్ తివారీ (Nitesh Tiwari) దర్శకత్వంలో నమిత్ మల్హోత్ర రూ.4000 కోట్ల బడ్జెట్తో రెండు భాగాలుగా రూపొందిస్తున్నారు. ఈ చిత్రం ప్రకటించిన నాటి నుంచి మంచి క్రేజ్ ఏర్పడింది. ఫస్ట్ లుక్, ఇటీవల విడుదల చేసిన టీజర్తో సినిమాకు మరింత హైప్ పెరిగింది. తాజాగా నిర్వహించిన కార్యక్రమంలో ఈ సినిమా గురించి రణ్బీర్ ఓ ఆసక్తికర విషయం చెప్పారు.
ఈ చిత్రంలో ఆయన రాముడి పాత్రతో పాటు పరశురాముడు పాత్ర కూడా పోషించినట్లు తెలిపారు. ‘మహా విష్ణువు ఆరో అవతారమైన పరశురాముడిగా కూడా నటించే అవకాశం రావడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నా. ఈ తరహా చిత్రాలు చేసేటప్పుడు బాడీ లాంగ్వేజ్ మాత్రమే కాదు.. ఆ పాత్ర తాలుకు లోతు, ఆధ్యాత్మికత, భావోద్వేగాలను పూర్తిగా అర్థం చేసుకోవాలి. ‘రామాయణ’ షూటింగ్కు వెళ్లడానికి ముందు ఏడాదిపాటు ఆ పాత్ర గురించి తెలుసుకున్నాను’ అని అన్నారు. ప్రస్తుతం మొదటి భాగం చిత్రీకరణ పూర్తయింది. ఈ ఏడాది దీపావళికి మొదటి భాగాన్ని విడుదల చేస్తారు. ఇక సినిమా ఓటీటీ డీల్ గురించి కూడా బాలీవుడ్లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. రామాయణ్ రెండు భాగాలకు కలిపి ఓ ఓటీటీ సంస్థ రూ.1000 కోట్ల ఆఫర్ చేసిందట. అయితే నమిత్ మల్హోత్ర సున్నితంగా తిరస్కరించి ఓటీటీ హక్కుల విషయంలో ధురంధర్ చిత్రబృందం ప్లాన్ను ఫాలో అయినట్లు బాలీవుడ్ మీడియా చెబుతోంది. ఇప్పుడు ఫస్ట్ పార్ట్ డీల్ ఓకే చేసుకుని దాని స్పందన బట్టి రెండోపార్ట్ బిజినెస్ పూర్తి చేస్తారని తెలుస్తోంది.