‘రామాయణ’.. పార్ట్ 1 కంటే రెండో భాగం బావుంటుంది
ABN , Publish Date - Aug 06 , 2026 | 12:49 PM
రణ్బీర్ కపూర్, యశ్, సాయిపల్లవి నటిస్తున్న ‘రామాయణ’పై ఆదిపురుష్ రచయిత మనోజ్ ముంతషిర్ స్పందించారు.
రణ్బీర్ కపూర్ (ranbir kapoor), యశ్, సాయిపల్లవి (sai pallavi) ప్రధాన పాత్రధారులుగా నితీశ్ తివారీ (Nitesh Tiwari) తెరకెక్కిస్తున్న ‘రామాయణ’ (Ramayana) ట్రైలర్ ఇటీవలే విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాను ‘ఆదిపురుష్’(Adipurush) తో పోల్చుతూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.
తాజాగా ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ విషయంపై ‘ఆదిపురుష్’ రచయిత మనోజ్ (Manoj Muntashir) స్పందించారు. ‘యశ్ మంచి నటుడు. ‘రామాయణ’లో ఆయన అద్భుతంగా నటించారు. మన భారతీయ ఇతిహాసాన్ని ప్రపంచ వేదికపైకి తీసుకెళ్లే ఏ సినిమాకైనా నా పూర్తి మద్దతు ఉంటుంది. ‘రామాయణ’ మంచి విజయం సాధించాలని అనుకుంటున్నా.
ఈ చిత్రాన్ని ‘ఆదిపురుష్’తో పోల్చద్దు. ‘ఆదిపురుష్’ ప్రేక్షకుల అంచనాలు అందుకోలేకపోయింది. ఆ సినిమా కోసం ప్రతీ ఒక్కరూ ఎంతో కష్టపడ్డారు. అయితే ‘ఆదిపురుష్’ సంగీతం లాగే ‘రామాయణ’ సంగీతం కూడా హిట్ కావడం ఆనందంగా ఉంది’ అని మనోజ్ అన్నారు.
మరోవైపు రణ్బీర్ ‘రామాయణ’ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘నిజాయితీగా చెప్పాలంటే రామాయణ’ లాంటి గొప్ప కావ్యాన్ని 10 భాగాలుగా తీయొచ్చు. కానీ రెండు భాగాల్లోనే నితీశ్ అద్భుతంగా తీస్తున్నారు. పార్ట్ 1 కంటే రెండో భాగం మరింత అద్భుతంగా ఉంటుంది’ అని తెలిపారు. నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్న ‘రామాయణ’ మొదటి భాగం ఈ దీపావళికి విడుదల కానుంది.