Sankranthiki Vasthunnam: త్వరలో సెట్స్ పైకి.. 'సంక్రాంతికి వస్తున్నాం' హిందీ రీమేక్!
ABN, Publish Date - Jan 22 , 2026 | 04:03 PM
'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాను దిల్ రాజు హిందీలో రీమేక్ చేస్తున్నారు. అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తుండగా, హీరోయిన్లుగా విద్యాబాలన్, రాశి ఖన్నా లను తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది.
ప్రముఖ నిర్మాత 'దిల్' రాజు (Dil Raju) గత యేడాది సంక్రాంతి కానుకగా విడుదల చేసిన 'సంక్రాంతికి వస్తున్నాం' (Sankranthiki Vasthunnam) మూవీ సింగిల్ లాంగ్వేజ్ లో విడుదలై ఘన విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ సినిమా రూ. 300 కోట్ల గ్రాస్ ను వసూలు చేసి, అప్పటి వరకూ ఏ సీనియర్ కు దక్కని విజయాన్ని నమోదు చేసుకుంది. ఇక ఈ యేడాది సంక్రాంతికి వచ్చిన 'మన శంకర వర ప్రసాద్ గారు' (Mana Sankara Vara Prasad Garu) ఆ రికార్డును తిరగరాసింది.
ఇదిలా ఉంటే 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీని హిందీలో అక్షయ్ కుమార్ (Akshay Kumar) తో రీమేక్ చేయబోతున్నట్టు గత నవంబర్ లో ఇఫీ వేడుకల్లో పాల్గొన్నప్పుడు నిర్మాత దిల్ రాజు, ఆయన సోదరుడు శిరీష్ తెలిపారు. అయితే ఇప్పుడు అందులో హీరోయిన్ల ఎంపిక తుది దశకు చేరినట్టు తెలుస్తోంది. తెలుగులో వెంకటేశ్ (Venkatesh) భార్యగా ఐశ్వర్య రాజేశ్ (Aishwarya Rajesh) నటించింది. ఇప్పుడీ పాత్రను హిందీలో విద్యాబాలన్ (Vidya Balan) తో చేయించబోతున్నట్టు తెలిసింది. అలానే వెంకటేశ్ మాజీ ప్రియురాలి పాత్రను మీనాక్షి చౌదరి (Meenakshi Chowdary) పోషించింది. ఆ క్యారెక్టర్ ను హిందీలో రాశీ ఖన్నా (Raashii Khanna) తో చేయించబోతున్నారట. అక్షయ్ కుమార్, విద్యాబాలన్, రాశీ ఖన్నా కాంబినేషన్ అనగానే సహజంగా బాలీవుడ్ వర్గాలలో సూపర్ క్రేజ్ నెలకొంది. అతి త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుందని తెలుస్తోంది.