Ramayana: ‘రామాయణ’ రేట్లు.. బెదిరిపోతున్న బయ్యర్లు!
ABN , Publish Date - May 23 , 2026 | 08:00 AM
రణ్బీర్ కపూర్ శ్రీరాముడిగా నటిస్తున్న ‘రామాయణ’ చిత్రం మొదటి భాగం దీపావళికి విడుదలకు సిద్ధమవుతోంది.
రణ్బీర్ కపూర్ శ్రీరాముడిగా నటిస్తున్న ‘రామాయణ’ చిత్రం మొదటి భాగం దీపావళికి విడుదలకు సిద్ధమవుతోంది. సాయిపల్లవి సీతగా నటిస్తున్న ఈ సినిమా రెండు భాగాలను రూ.4 వేల కోట్లతో నిర్మిస్తున్నట్లు నిర్మాత నమిత్ మల్హోత్రా ప్రకటించి అంచనాలు పెంచారు. దర్శకుడు నితిశ్ తివారి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉండడంతో నిర్మాత నమిత్ బిజినెస్ వ్యవహారాల మీద దృష్టి పెట్టారు. ‘రామాయణ’ థియేట్రికల్ రైట్స్ కోసం ధర్మా ప్రొడక్షన్స్, ఏఏ స్టూడియోస్, పెన్ ప్రొడక్షన్స్ సంస్థలు రంగంలోకి దిగాయి. అయితే నిర్మాత చెబుతున్న రేట్ మాత్రం పంపిణీదారులకు మింగుడు పడడం లేదు. రూ.నాలుగు వందల కోట్లు ఇస్తే హిందీ వెర్షన్ థియేట్రికల్ హక్కులు ఇచ్చేస్తానని నమిత్ చెబుతున్నారట. ఇది చాలా పెద్ద మొత్తం కనుక ఆ రేటు విని బయ్యర్లు కళ్లు తేలేస్తున్నారట. రూ. 300 కోట్లకు డీల్ ఫైనలైజ్ కావచ్చని అంటున్నారు. ఇక తెలుగు వెర్షన్కు ఎంత డిమాండ్ చేస్తారో చూడాలి.
ఇదిలా ఉంటే చిత్ర కథానాయకుడు రణ్బీర్ కపూర్ ప్రమోషన్స్ గురించి చర్చించడానికి నిర్మాత నమిత్ ప్రైమ్ ఫోకస్ ఆఫీసుకు వెళ్లారు. నిజానికి హీరోయిన్ సాయిపల్లవి పుట్టినరోజున ఆమె లుక్ పోస్టర్ను విడుదల చేయాలని నిర్మాత ప్లాన్ చేశారు. కానీ ఆమె నటించిన హిందీ చిత్రం ‘ఏక్దిన్’ ప్లాప్ అవడంతో ఆ ఆలోచన వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో రణ్బీర్ ‘రామాయణ’ ఆఫీసుకు వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది.