బోర్డర్ మరో సీక్వెల్.. తెరపైకి హర్బక్ష్ సింగ్ బయోపిక్
ABN, Publish Date - Jun 24 , 2026 | 04:40 PM
1965 ఇండో-పాక్ యుద్ధంలో కీలక పాత్ర పోషించిన జనరల్ హర్బక్ష్ సింగ్ జీవిత కథ ఆధారంగా బయోపిక్ తెరకెక్కనుంది.
బాలీవుడ్ (Bollywood)లో మరో యుద్ధ వీరుడి జీవిత కథ తెరకెక్కనుంది. 1965 ఇండో - పాక్ యుద్ధంలో భారత సైన్యానికి నాయకత్వం వహించి, 1966లో పద్మ విభూషణ్ (Padma Vibhushan) అవార్డును అందుకున్న యుద్ధ వీరుడు జనరల్ హర్బక్ష్ సింగ్ (Harbaksh Singh) బయోపిక్ను నిర్మిస్తున్నామని నిర్మాణ సంస్థ జెపీ ఫిల్మ్స్ ప్రకటించింది.
‘చరిత్రను మలుపు తిప్పిన ఒక గొప్ప వ్యక్తి కథను చెబుతూనే, భారతీయ సైనిక చరిత్రలోని ఒక ముఖ్యమైన అధ్యాయాన్ని నేటి యువతరానికి అందించడమే ఈ సినిమా లక్ష్యం’ అని నిర్మాత నిధి దత్తా పేర్కొన్నారు. అయితే, ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించే నటుడితో పాటు ఇతర తారాగణం వివరాలను ప్రకటించాల్సి ఉంది. అయితే.. సన్నీ డియోల్ ఈ పాత్రలో నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి
కాగా, సన్నీ డియోల్ (Sunny Deol) ప్రధాన పాత్రలో నటించిన ‘బోర్డర్ 2’ చిత్రానికి సీక్వెల్గా ‘బోర్డర్ 3’ (Border 3) ని నిర్మించనున్నట్లు ఆమె ప్రకటించారు. ప్రస్తుతం భూషణ్ కుమార్ భాగస్వామంలో ఈ సినిమా ప్రాథమిక స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని చెప్పారు. దేశభక్తి కథను చెప్పాలనే మా నిరంతర నిబద్ధతకు ఈ మూడో భాగం ఒక నిదర్శనమని ఆమె పేర్కొన్నారు.