Drishyam 3: 'దృశ్యం 3’ ఈసారి అలా కాదు.. ఇలా..
ABN, Publish Date - Aug 29 , 2026 | 07:17 PM
మలయాళంలో మోహన్లాల్తో మొదలైన ‘దృశ్యం’ థ్రిల్లర్ ప్రయాణం.. ఆ తర్వాత తెలుగు, హిందీ సహా పలు భాషల్లోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంది.
మలయాళంలో మోహన్లాల్తో మొదలైన ‘దృశ్యం’ (Drishyam 3) థ్రిల్లర్ ప్రయాణం.. ఆ తర్వాత తెలుగు, హిందీ సహా పలు భాషల్లోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా విజయ్ సాల్గావ్కర్ పాత్ర చుట్టూ అల్లుకున్న మైండ్ గేమ్, కుటుంబాన్ని కాపాడుకునేందుకు అతడు వేసే ఎత్తులు ఈ ఫ్రాంచైజ్కు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాయి. ఇప్పుడు ఈ సిరీస్లో మూడో భాగంగా తెరకెక్కుతున్న ‘దృశ్యం 3’పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. అజయ్ దేవ్గణ్ హీరోగా రూపొందుతున్న హిందీ ‘దృశ్యం 3’ 2026 అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ విషయాన్ని శ్రియా శరణ్ కొత్త పోస్టర్ను విడుదల చేసి తెలిపారు. నందినిగా ఆమె ఎదుర్కొనే పరిస్థితులు ఈసారి మరింత భావోద్వేగభరితంగా ఉండనున్నాయనే సంకేతాలు పోస్టర్ ద్వారా కనిపిస్తున్నాయి.
స్టార్ స్టూడియోస్ సమర్పణలో పనోరమా స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అభిషేక్ పాఠక్ దర్శకత్వం వహిస్తున్నారు. అభిషేక్ పాఠక్, ఆమిల్ కీయన్ ఖాన్, పర్వేజ్ షేక్ కథను అందించారు. అలోక్ జైన్, అజిత్ అంధారే, కుమార్ మంగత్ పాఠక్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది.
‘దృశ్యం’, ‘దృశ్యం 2’ హిందీ వెర్షన్లు మలయాళ ఒరిజినల్ కథలకు చాలా దగ్గరగా సాగాయి. అయితే ‘దృశ్యం 3’ విషయంలో మాత్రం మేకర్స్ కొత్తగా ఆలోచించినట్లు తెలుస్తోంది. మలయాళ చిత్రాన్ని యథాతథంగా రీమేక్ చేయకుండా.. హిందీ ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా కథలో కొన్ని కీలక మార్పులు, కొత్త మలుపులు జోడించినట్లు చెబుతున్నారు. దీంతో మలయాళ వెర్షన్ కథ ఇప్పటికే తెలిసిన ప్రేక్షకులకు కూడా హిందీ ‘దృశ్యం 3’ ఆసక్తికరమైన అనుభూతిని అందించే అవకాశం ఉంది. ముఖ్యంగా విజయ్ సాల్గావ్కర్ మరోసారి తన కుటుంబాన్ని ఎలా కాపాడుకోబోతున్నాడన్నదే ఈ సినిమాలో ప్రధాన ఆకర్షణగా మారనుంది.