Pawan Kalyan: 'ఉస్తాద్ భగత్ సింగ్'.. క్రేజీ ఆప్డేట్
ABN, Publish Date - Dec 25 , 2025 | 07:51 PM
పవన్ కళ్యాణ్ తాజా చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్' చివరి షెడ్యూల్ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా చిత్ర సినిమాటోగ్రాఫర్ అయనంక బోస్ కు హరీశ్ శంకర్ థ్యాంక్స్ చెప్పారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా నటిస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' (Ustad Bhagath Singh) నుండి ఆ మధ్య 'దేఖ్ లేంగే సాలా' సాంగ్ వచ్చి... సోషల్ మీడియాను ఊపేసింది. ఆ పాటతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లో సరికొత్త జోష్ నెలకొంది. రాశీఖన్నా (Rasi Khanna) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా చివరి షెడ్యూల్ ప్రస్తుతం జరుగుతోంది. ఈ విషయాన్ని అధికారికంగా దర్శకుడు హరీశ్ శంకర్ (Harish Shankar) సోషల్ మీడియా ద్వారా తెలిపారు.
మూవీ సినిమాటోగ్రాఫర్ అయనంక బోస్ తో తాను ఉన్న ఫోటోను హరీశ్ శంకర్ పోస్ట్ చేస్తూ... మెరుపు వేగంతోనూ, మెరుపులానూ లైటింగ్ చేసే అయనంక బోస్ కు కృతజ్ఞతలు తెలిపాడు. ఆయన లేకుంటే ఇది సాధ్యం అయ్యేది కాదని హరీశ్ ఆ పోస్ట్ లో పేర్కొంటూ రెండు ఫోటోలను పెట్టాడు. ఈ షెడ్యూల్ ఎప్పటి వరకూ సాగుతుందనే వివరాలను ఇవ్వకపోయినా... ఇదే చివరి షెడ్యూల్ అని పేర్కొనడంతో పవన్ కళ్యాణ్ అభిమానులంతా ఇక విడుదల తేదీ కోసం ఎదురుచూడటం మొదలెట్టేశారు.
'గబ్బర్ సింగ్' తర్వాత పవన్ కళ్యాణ్, హరీశ్ శంకర్ కాంబోలో వస్తున్న సినిమా కావడం, దీనికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండటంతో 'ఉస్తాద్ భగత్ సింగ్' పై అంచనాలు అంబరాన్ని తాకాయి. దానికి తగ్గట్టుగానే మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రాన్ని నిర్మించింది.