Nawabpet Devara: మొన్న ‘పొద్దుటూరు దసరా’.. నేడు ‘నవాబుపేట దేవర’
ABN, Publish Date - Dec 21 , 2025 | 07:54 PM
‘పొద్దుటూరు దసరా’ ఫేమ్ మురళీకృష్ణ తుమ్మ రూపొందించిన ‘నవాబుపేట దేవర’ డాక్యుమెంటరీ ప్రీమియర్ హైదరాబాద్లో ఘనంగా జరిగింది.
‘పొద్దుటూరు దసరా’ డాక్యుమెంటరీతో విశేష ప్రశంసలు అందుకున్న దర్శకుడు మురళీకృష్ణ తుమ్మ తాజాగా తెరకెక్కించిన ‘నవాబుపేట దేవర’ డాక్యుమెంటరీ ప్రీమియర్ షో హైదరాబాద్లో శనివారం సాయంత్రం ఘనంగా జరిగింది. బిందు ప్రియ, పూజ కృష్ణ తుమ్మ నిర్మించిన ఈ డాక్యుమెంటరీ ప్రదర్శనకు నటుడు మహేశ్ విట్టా ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మహేశ్ విట్టా మాట్లాడుతూ రాయలసీమలో దేవర పండుగను ఎంతో ప్రత్యేకంగా జరుపుతారని తెలిపారు. గతంలో మురళీ రూపొందించిన ‘పొద్దుటూరు దసరా’ డాక్యుమెంటరీ తనను ఆకట్టుకుందని చెప్పారు. రాయలసీమ నేపథ్యంతో మరిన్ని కథలు సినిమాలుగా రావాల్సిన అవసరం ఉందని, ఆ దిశగా మురళీ సినిమా చేయాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. డాక్యుమెంటరీ టీమ్కు శుభాకాంక్షలు తెలిపారు.
ప్రొడ్యూసర్ శివప్రసాద్ మాట్లాడుతూ చిన్ననాటి నుంచీ చూసిన దేవర పండుగను డాక్యుమెంటరీ రూపంలో చూపించాలన్న ఆలోచనతో మురళీని సంప్రదించామని తెలిపారు. రెండు రోజుల జాతర సమయంలో దర్శకుడు చేసిన కష్టం ప్రశంసనీయమని అన్నారు. త్వరలో మరో డాక్యుమెంటరీని కూడా మురళీ దర్శకత్వంలో చేయబోతున్నట్లు వెల్లడించారు.
ప్రొడ్యూసర్ పూజ కృష్ణ తుమ్మ మాట్లాడుతూ ‘నవాబుపేట దేవర’ డాక్యుమెంటరీ అవుట్పుట్ చాలా బాగా వచ్చిందన్నారు. సంప్రదాయ ఆచారాలను నిజాయితీగా చూపించారని ప్రశంసించారు. ఇలాంటి డాక్యుమెంటరీలు మరిన్ని రావాలని కోరుకున్నారు.
నవాబుపేట సర్పంచ్ పాతకోట సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ఊహించినదానికంటే డాక్యుమెంటరీ మరింత ఆకట్టుకుందని తెలిపారు. మ్యూజిక్, విజువల్స్ ప్రత్యేకంగా నిలిచాయని అన్నారు.
డైరెక్టర్ మురళీకృష్ణ తుమ్మ మాట్లాడుతూ ‘పొద్దుటూరు దసరా’ విజయం తనకు ధైర్యం ఇచ్చిందని చెప్పారు. 32 గంటల కఠిన శ్రమతో ఈ డాక్యుమెంటరీ రూపొందించామని తెలిపారు. టీమ్ సపోర్ట్ లేకపోతే ఇది సాధ్యమయ్యేదికాదని పేర్కొన్నారు.