Thandel: తండేల్ రాజు.. టీవీల్లోకి వచ్చేస్తున్నాడు! ఎప్పుడంటే?
ABN, Publish Date - Jun 22 , 2025 | 12:45 PM
నాగ చైతన్య, సాయిపల్లవి జంటగా చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన తండేల్ సినిమా తెలుగు టీవీ ఛానల్లో ప్రసారానికి రెడీ అయింది.
అక్కినేని నాగ చైతన్య (Naga Chaitanya) , సాయిపల్లవి (Sai Pallavi) జంటగా కార్తికేయ2 వంటి బ్లాక్బస్టర్ హిట్ తర్వాత చందు మొండేటి (Chandoo Mondeti) దర్శకత్వంలో అల్లు అరవింద్ (Allu Aravind) గీతా ఆర్ట్స్2 (Geetha Arts 2) బ్యానర్లో రూపొంది మంచి విజయం సాధించిన చిత్రం తండేల్ (Thandel). నిజ ఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన అన్ని ప్రాంతాలలో మొదటిరోజు నుంచే పాజిటివ్ టాక్తో నడిచి రూ. 100 కోట్ల వసూళ్ల మైలురాయిని సైతం దాటి చైతన్యకు మెమరబుల్ హిట్ను అందించి తన కెరీర్కు మంచి బూస్ట్ ఇచ్చింది.
సాయి పల్లవి యాక్టింగ్, డ్యాన్స్, దేవీ శ్రీ ప్రసాద్ (DEVI SRI PRASAD) సంగీతం, పాటలు ఒకదానితో ఒకటి సెట్ అయి ఈ యేడు భారీ విజయం సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఆపై నెట్ఫ్లిక్స్ ఓటీటీలో డిజిటల్ స్ట్రీమింగ్కు సైతం వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ నుంచి మంచి ఆదరణనే దక్కించుకుని మూడు నాలుగు వారాల పాటు ట్రెండింగ్లో నిలిచింది. అయితే ఇప్పుడు ఈ చిత్రం బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. అయితే ఈ చిత్రం శాటిలైట్ హక్కులను ఫ్యాన్సీ రేటుకు జీ తెలుగు దక్కించుకోకున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలో ఈ సినిమాను ఈ నెల చివరి వారం జూన్ 29 ఆదివారం రోజున వరల్డ్ డిజిటల్ ప్రీమియర్గా జీ తెలుగు (Zee Telugu) ఛానల్లో సాయంత్రం 6 గంటలకు ప్రసారం కానుంది. ఈ మేరకు సదరు సంస్థ అధికారికంగా ప్రకటిస్తూ తమ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. దీంతో మరోమారు చైతన్య, సాయి పల్లవి జంట రెండు తెలుగు రాష్ట్రాల టీవీ ఛానళ్లలో సందడి చేయనుంది. ఇంటి పట్టున ఉండే వారికి వచ్చే ఆదివారం మంచి అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ అందనుంది.