Film Awards : రిపీట్ అయ్యింది పెళ్ళిచూపులు మాత్రమే...
ABN , Publish Date - Jun 16 , 2025 | 05:09 PM
నంది అవార్డులను ఏపీ ప్రభుత్వం 2014, 15, 16 సంవత్సరాలకు అప్పట్లో ప్రకటించింది. ఇప్పుడు అదే సంవత్సరాలకు తెలంగాణ ప్రభుత్వం యేడాది మూడు సినిమాలను ప్రకటించింది. వాటికి వీటికి ఎంతో తేడా ఉంది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) అనుకున్న విధంగానే తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ (Gaddar Film Awards) కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. 2024లో విడుదలైన సినిమాలకు అవార్డులను ఇవ్వడంతో పాటు 2014 నుండి 2023 వరకూ యేడాదికి మూడు చిత్రాలను ఎంపిక చేసి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను అందచేశారు. ఆసక్తికరమైన అంశం ఏమంటే... చంద్రబాబు (Chandrababu) నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పట్లో 2014, 2015, 2016 నంది అవార్డులను ప్రకటించింది. వాటిలోనూ ప్రథమ ద్వితీయ, తృతీయ బహుమతులకు సినిమాలను ఎంపిక చేసింది.
నంది అవార్డులలో ఈ మూడు ఏళ్ళకు అవార్డు వచ్చిన సినిమాలను, ఇక్కడ అదే మూడేళ్ళకు అవార్డు వచ్చిన చిత్రాలను పోల్చితే ఎక్కడా పొంతన లేదు. 2014వ సంవత్సరానికి ఏపీ ప్రభుత్వం 'లెజెండ్, మనం, హితుడు' చిత్రాలను ఫస్ట్, సెకండ్, థర్డ్ బెస్ట్ మూవీస్ గా నంది అవార్డులకు ఎంపిక చేసింది. ఇక్కడ అదే సంవతర్సానికి 'రన్ రాజా రన్, పాఠశాల, అల్లుడు శ్రీను' చిత్రాలను మురళీ మోహన్ ఛైర్మన్ గా ఉన్న కమిటీ ఎంపిక చేసింది. 2015వ సంవత్సరానికి గానూ 'బాహుబలి -1, ఎవడే సుబ్రమణ్యం, నేను... శైలజ' చిత్రాలు ఫస్ట్, సెకండ్, థర్డ్ బెస్ట్ మూవీస్ గా నంది అవార్డులకు ఎంపిక కాగా, ఇక్కడ ఆ యేడాదికి 'రుద్రమ దేవి, కంచె, శ్రీమంతుడు' చిత్రాలను ఎంపిక చేశారు. ఇక 2016వ సంవత్సరానికి నంది అవార్డులలో 'పెళ్ళిచూపులు, అర్థనారి, మనలో ఒకడు' చిత్రాలు ఫస్ట్, సెకండ్, థర్డ్ బెస్ట్ మూవీస్ గా నంది అవార్డులకు ఎంపిక కాగా... ఇక్కడ 'శతమానం భవంతి' ప్రథమ ఉత్తమ చిత్రంగా, 'పెళ్ళిచూపులు' ద్వితీయ ఉత్తమ చిత్రంగా, 'జనతా గ్యారేజ్' తృతీయ ఉత్తమ చిత్రంగా ఎంపికయ్యాయి. అంటే... ఈ మూడు సంవత్సరాలలో కేవలం 'పెళ్ళిచూపులు' మాత్రమే అక్కడ, ఇక్కడ అవార్డులకు ఎంపికైంది. నంది అవార్డులలో రాజ్ కందుకూరి నిర్మించిన 'పెళ్ళిచూపులు'కు ఫస్ట్ బెస్ట్ పిక్చర్ అవార్డు రాగా, గద్దర్ అవార్డ్స్ లో సెకండ్ బెస్ట్ పిక్చర్ అవార్డు లభించింది. ఈ అవార్డును ఆయన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అందుకున్నారు.
అయితే ఇక్కడో చిన్న మెలిక కూడా ఉంది. 2014వ సంవత్సరంలో గద్దర్ అవార్డ్స్ కు తెలంగాణ ఆవిర్భావ దినమైన జూన్ 2 తర్వాత విడుదలైన సినిమాలను మాత్రమే పరిగణనలోకి తీసుకున్నట్టు కమిటీ తెలిపింది. ఆ రకంగా అక్కడ ప్రథమ, ద్వితీయ చిత్రాలుగా నంది అవార్డులకు ఎంపికైన 'లెజెండ్, మనం' చిత్రాలను ఇక్కడి కమిటీ పరిగణనలోకి తీసుకోలేదట.
2014 నుండి 16 వరకూ నంది అవార్డుల ప్రకటన జరిగింది కానీ వాటి ప్రదానోత్సవం జరగలేదు. ఇప్పుడు గద్దర్ అవార్డులను తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అక్కడ ఇప్పటికే ప్రకటించిన ఆ మూడేళ్ళ నంది అవార్డులను ఎంత త్వరగా ఇస్తే అంత బాగుంటుందని సినీజనం అంటున్నారు. అలానే మిగిలిన సంవత్సరాలకు కూడా కొన్ని కేటగిరిలలో అయినా అవార్డులను ఇస్తే మంచిదన్నది వారి అభిమతం. రెండు తెలుగు రాష్ట్రాలు సినిమా అవార్డులను ప్రతి యేడాదీ ఇస్తే... సినీ జనాలకు డబుల్ థమాకానే! మరి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ విషయమై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
Also Read: Manchu Vishnu: కన్నప్పను వీక్షించిన రజినీకాంత్.. విష్ణు ఎమోషనల్
Also Read: Akkineni Nagarjuna: నాన్న పర్స్ లో డబ్బులు దొంగతనం చేశా...