Satya Reddy: బుద్ధిజంపై సత్యారెడ్డి సినిమా
ABN , Publish Date - Sep 20 , 2025 | 03:28 PM
నటుడు, దర్శక నిర్మాత సత్యారెడ్డి ఇప్పుడు ఓ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ పై దృష్టి పెట్టాడు. 'కింగ్ బుద్ధ' పేరుతో వివిధ భాషల్లో ఓ సినిమాను స్వీయ దర్శకత్వంలో నిర్మించబోతున్నారు. తన గత చిత్రం 'ఉక్కు సత్యాగ్రహం' షూటింగ్ సమయంలో గద్దర్ తో ఈ ప్రాజెక్ట్ గురించి చర్చించానని సత్యారెడ్డి తెలిపారు.
తెలుగు, తమిళ, హిందీ చిత్ర పరిశ్రమలలో సుదీర్ఘ అనుభవం ఉన్న దర్శక, నిర్మాత సత్యారెడ్డి తాజాగా హాలీవుడ్ స్థాయిలో ఓ సినిమా నిర్మించబోతున్నారు. ఇందులో భాగంగా పాన్ వరల్డ్ సినిమాస్ అనే పేరుతో ఓ బ్యానర్ ను కూడా రిజస్టర్ చేశారు. ఈ సినిమాకి అన్ని భాషల్లో 'కింగ్ బుద్ధ' అనే టైటిల్ కన్ఫామ్ చేసినట్లు తెలిసింది. దాదాపు పాతికేళ్ల క్రితం 'సర్దార్ చిన్నపరెడ్డి' చిత్రంతో సినీ జీవితాన్ని ఆరంభించిన ఆయన 'ప్రేమికుల రోజు' ఫేమ్ కునాల్ తో 'కుర్రకారు', 'రంగుల కళ'; 'శంకర్ దాదా జిందాబాద్' ఫేమ్ కరిష్మా కోటక్ తో పాటు పలువురు ప్రముఖ హీరో, హీరోయిన్లతో 55 చిత్రాలను రూపొందించారు. ఇందులో కొన్నింటికి దర్శకుడిగా, మరి కొన్నింటికి నిర్మాతగా, ఇంకొన్ని సినిమాల్లో హీరోగా చేశారు. ఓ వైపు దర్శక, నిర్మాతగా, నటుడిగా తన అభిరుచిని చాటుకుంటూనే నిర్మాతల మండలిలో కూడా కీలక పాత్రను పోషిస్తున్నారు. 2016 లో తెలుగు ఫిలిం ఛాంబర్ ప్రొడ్యూసర్ సెక్టార్ చైర్మన్ గా కూడా సత్యారెడ్డి ఎన్నికయ్యారు. ఇదిలా ఉంటే ఆ మధ్య వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజాయుద్ధ నౌక గద్దర్ తో 'ఉక్కు సత్యాగ్రహం' చిత్రం నిర్మించి ప్రపంచంలోని పలు భాషల్లోకి అనువదించారు. ఈ చిత్ర నిర్మాణంలో రష్యాతో పాటు, అమెరికాకి చెందిన హాలీవుడ్ యాక్టర్లు కొందరు పరిచయం అయ్యారని, వారి సహకారంతో తదుపరి ప్రాజెక్ట్ హాలీవుడ్ స్థాయిలో చేయాలని అప్పుడే నిర్ణయించుకున్నానని సత్యారెడ్డి తెలిపారు.
'ఉక్కు సత్యాగ్రహం' చిత్రకథలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి టెక్నికల్ సహాయం చేసిన రష్యన్లను కలిసే ముందు అప్పట్లో గద్దర్ ఆదేశాల మేరకు, ఆయన ఇచ్చిన ప్రేరణతో బుద్ధిజం పైన హాలీవుడ్లో ఓ సినిమాను నిర్మించేందుకు సన్నాహాలు చేశానని సత్యారెడ్డి తెలిపారు. ఈ ప్రాజెక్ట్ గురించి ఆయన మాట్లాడుతూ, 'ఈ తాజా చిత్రం షూటింగ్ లొకేషన్ల కోసం ఇప్పటికే అమెరికా, చైనా, టిబెట్, నేపాల్, థాయ్ లాండ్, సింగపూర్, మలేషియా తదితర దేశాలు పర్యటించామని చెప్పారు. ప్రస్తుతం చిత్ర నటీనటులు సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతోందని, త్వరలో అమెరికాలో ప్రముఖుల సమక్షంలో మూవీ పోస్టర్ లాంచ్ తో పాటు అన్ని వివరాలు ప్రకటిస్తాన'ని తెలిపారు.
Also Read: Siddhu Jonnalagadda: ‘ఓజీ’ హైప్.. టిల్లు ఏమన్నాడంటే..
Also Read: Tribute to ANR: ఒకేరోజు పద్మశ్రీ పురస్కారం అందుకున్న ఎన్టీఆర్, ఎఎన్ఆర్...