TG Vishwa Prasad: రిలీజ్లను అడ్డుకునే.. ప్రయత్నాలు ఆపాలి! రాజాసాబ్.. లెక్కలు క్లియర్
ABN, Publish Date - Dec 07 , 2025 | 08:33 AM
గత కొంత కాలంగా సౌత్ సినిమా ఇండస్ట్రీలో వరుసగా భారీ సినిమాలు రిలీజ్కు ముందు వాయిదాలు పడుతూ వస్తున్న సంగతి తెలిసిందే.
గత కొంత కాలంగా సౌత్ సినిమా ఇండస్ట్రీలో వరుసగా భారీ సినిమాలు రిలీజ్కు ముందు వాయిదాలు పడుతూ వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చియాన్ విక్రమ్ నటించిన దృవ నక్షత్రం సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుని దాదాపు పదేండ్లు అవుతున్నా ఇప్పటికీ రిలీజ్కు నోచుకోలేదు. అంతేగాక ఇటీవల కార్తీ నటించిన వా వాతియార్ కూడా చిక్కుల్లో ఉంది. అయితే తాజాగా తెలుగులో బాలకృష్ణ అఖండ2 చిత్రం కూడా సరిగ్గా రిలీజ్కు ముందు ఇలాంటి సమస్యల్లో చిక్కుకోగా రాజాసాబ్, ప్రశాంత్ వర్మ సిరీస్లు వంటి మరికొన్ని చిత్రాల విషయంలోనూ ఇలాంటి వార్తలు బాగా వినిపిస్తున్నాయి.
ఈ క్రమంలో ప్రముఖ తెలుగు నిర్మాత, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ (People Media Factory) అధినేత టీజీ విశ్వ ప్రసాద్ (Vishwa Prasad) ఈ ఇష్యూపై స్పందించి తన స్పందన తెలియజేశారు. ఈ మేరకు సోషల్మీడియా వేదికగా ఓ పోస్టు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సినిమాల విడుదలకు గంటల ముందు అడ్డంకులు సృష్టించే చర్యలు ఇటీవల పెరుగుతూ ఉండటం పరిశ్రమలో తీవ్ర ఆందోళనకు దారి తీస్తోంది. పెద్ద సినిమాల రిలీజ్ తేదీలను దృష్టిలో పెట్టుకుని తమ చిత్రాలను విడుదల చేయడానికి సిద్ధమయ్యే చిన్న నిర్మాతలు, అలాగే ఎంతో కష్టపడి సినిమాలు పూర్తి చేసే కళాకారులు, టెక్నీషియన్లు పెద్ద ఎత్తున దెబ్బతింటున్నారు.
తాజాగా.. అఖండ 2 (Akhanda 2) విడుదలకు ముందురోజు చోటు చేసుకున్న పరిణామాలు ఇండస్ట్రీ అంతటా కలకలం రేపుతున్నాయి. చివరి నిమిషంలో రిలీజ్ను అడ్డుకోవడానికి జరిగిన ప్రయత్నాలు, ఇక ప్రభాస్ రాజాసాబ్ (Rajasaab) చిత్రాన్ని చుట్టుముట్టిన ఊహాగానాలు తీవ్రంగా కలిచి వేశాయి, నన్ను బాగా డిస్ట్రబ్ చేసింది. సినీ పరిశ్రమలో అటువంటి జోక్యాలకు చోటు ఉండకూడదని బావిస్తున్నా. సినిమాల విడుదలలను అడ్డుకోవడం వల్ల ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు, ఫైనాన్షియర్లు, టెక్నీషియన్లు, వందలాది మంది కార్మికుల జీవనాధారం సైతం ప్రమాదంలో పడుతోంది. ఇలాంటి పరిస్థితులు మళ్లీ రాకుండా చట్టపరమైన స్పష్టమైన మార్గదర్శకాలు తీసుకురావాల్సిన అవసరాన్ని పరిశ్రమ వర్గాలు గుర్తించాలి. అలాగే, ఈ అనవసర జోక్యాల వల్ల నష్టపోయిన వారు చట్టపరమైన చర్యలు తీసుకోవడం ద్వారా భవిష్యత్తులో ఇటువంటి చర్యలకు అడ్డుకట్ట పడేలా ప్రయత్నాలు చేయాలి.
ఇక.. మా రాజసాబ్ సినిమా విషయానికి వస్తే ఈ ప్రాజెక్ట్కు సంబంధించిన అన్ని పెట్టుబడులు ఇంటర్నల్ ఫండ్స్తో పూర్తిగా క్లియర్ అయ్యాయి. మిగిలిన ఒకటి రెండు లావాదేవీలకు సంబంధించిన వడ్డీ చెల్లింపులు బిజినెస్ ప్రారంభమయ్యేలోపు పూర్తవుతాయని తెలిపారు. త్వరలో విడుదల కానున్న అఖండ 2తో పాటు రాజాసాబ్, మన శంకర వర ప్రసాద్, భర్త మహాశయులకు విజ్ఞప్తి, అనగనగా ఒక రాజు, నారి నారి నడుమ మురారి, జన నాయకన్, పరాశక్తి తో పాటు రానున్న అన్ని సినిమాలు మంచి విజయాలు సాధించాలని అశిస్తున్నా అన్నారు.