Nagarjuna: గత జన్మల స్టోరీలు అంటే.. నాకు బాగా ఇష్టం
ABN, Publish Date - Nov 11 , 2025 | 05:52 PM
గత జన్మల నేపథ్యంతో సాగే కథలు ఎప్పుడూ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున అన్నారు.
గత జన్మల నేపథ్యంతో సాగే కథలు ఎప్పుడూ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున (Nagarjuna)అన్నారు. ‘గత వైభవం’ (Gatha Vaibhavam) మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్కి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. నాన్న అక్కినేని నాగేశ్వరరావు గారు మూగ మనసులు వంటి గత జన్మల థీమ్ సినిమాతో హిట్ అందుకున్నారు. నేను కూడా జానకి రాముడు ద్వారా ఆ తరహా కథలో విజయం సాధించాను. అలాంటి కథలంటే నాకు ఎప్పటి నుంచో ఇష్టం. అదే నేపథ్యంతో ‘గత వైభవం’ వస్తుండటం ఆనందంగా ఉందని తెలిపారు.
మూవీ ట్రైలర్ చూసిన వెంటనే ఈ సినిమా కోసం టీమ్ ఎంత కష్టపడ్డారో స్పష్టంగా కనిపిస్తోందని నాగార్జున అన్నారు. నాలుగు తరాల కథ అని విన్నాను. ఆషిక రంగనాథ్ (Ashika Ranganath) ఈ సినిమా గురించి చాలా రోజుల నుంచే చెబుతూ వస్తోంది. ఆమె ఎంతో ప్రతిభావంతురాలు. దుష్యంత్ (Dushyant) కి ఇది తొలి సినిమా, కాస్త టెన్షన్ ఉండటం సహజమే అని చిరునవ్వుతో చెప్పారు.
హీరోయిన్ ఆషిక రంగనాథ్ మాట్లాడుతూ.. “గత జన్మలు, ఫాంటసీ అంశాలతో కూడిన చిత్రంలో నేను ఇంతకు ముందు నటించలేదు. దేవకన్య పాత్ర కోసం సంప్రదాయ ఆభరణాలు ధరించి, ఆ కేరెక్టర్లో జీవించడం నాకు సవాల్గా అనిపించిందని తెలిపారు. హీరో దుష్యంత్ మాట్లాడుతూ.. “తొలి సినిమా కాబట్టి స్పెషల్గా ఏదైనా చేయాలనుకున్నా. అందుకే ఫాంటసీ జానర్ను ఎంచుకున్నా. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చినా, నా కంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలనేది నా లక్ష్యమని చెప్పారు.
ఇదిలాఉంటే.. దర్శకుడు సునీల్ కుమార్ తెరకెక్కించిన ‘గత వైభవం’ సినిమా నవంబర్ 14న కన్నడతో పాటు తెలుగులో థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే విడుదల చేసిన ట్రైలర్, పాటలు మంచి రెస్పాన్స్ దక్కించుకున్నాయి. అయితే ఈ సినిమా రిలీజ్ రోజే ఈవెంట్కు గెస్ట్గా వచ్చిన నాగార్జున లెజెండరీ చిత్రం శివ రీ-రిలీజ్ అవుతుండడం మరో విశేషం.