Mithramandali: ‘జాతిరత్నాలు’ మించి ‘మిత్రమండలి’
ABN, Publish Date - Oct 08 , 2025 | 09:36 AM
ప్రియదర్శి , నిహారికా ఎన్.ఎం జంటగా నటించిన చిత్రం ‘మిత్రమండలి’ . దీపావళి సందర్భంగా ఈ నెల 16న విడుదలవుతోంది.
ప్రియదర్శి (Priyadarshi), నిహారికా ఎన్.ఎం (Niharika NM) జంటగా నటించిన చిత్రం ‘మిత్రమండలి’ (Mithramandali). బన్నీ వాస్ (BunnyVasu) సమర్పణలో కల్యాణ్ మంతెన, భాను ప్రతాప్, డా. విజయేందర్రెడ్డి తీగల నిర్మించారు. సోమరాజు పెన్మత్స సహ నిర్మాత. విజయేందర్ ఎస్ (Vijayendra S) దర్శకుడు. దీపావళి సందర్భంగా ఈ నెల 16న విడుదలవుతోంది. మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో చిత్రబృందం ట్రైలర్ను విడుదల చేసింది.
ఈ సందర్భంగా బన్నీ వాస్ (BunnyVasu) మాట్లాడుతూ ‘మిత్రమండలి’ కథ నా మనసుకు బాగా నచ్చింది. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను నవ్విస్తుంది. సరికొత్త వినోదాన్ని పంచుతుంది. ఒక పరిపూర్ణ దీపావళి ఎంటర్టైనర్గా ‘మిత్రమండలి’ రూపుదిద్దుకుంది’ అని చెప్పారు.
ప్రియదర్శి మాట్లాడుతూ ‘ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకోవాలనే లక్ష్యంతో ‘మిత్రమండలి’ సినిమా చేశాం. ‘జాతిరత్నాలు’ సినిమాకు రెట్టింపు నవ్వులు పంచుతుంది. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇవ్వబోతున్నాం. నలుగురు స్నేహితులు సరదాగా మాట్లాడుకుంటే ఎలాంటి ఆనందం కలుగుతుందో మా సినిమా కూడా అలాంటి అనుభూతిని ఇస్తుంది’ అన్నారు. కథ వినగానే మిత్రమండలి సినిమా చేయాలనుకున్నాను, మొదటి సినిమాలోనే మంచి పాత్ర దక్కినందుకు ఆనందంగా ఉంది అని నిహారికా ఎన్.ఎం అన్నారు.