Chiranjeevi: ఎంతో జటిలమైన సమస్యను పరిష్కరించారు.. ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు
ABN, Publish Date - Aug 22 , 2025 | 07:55 AM
టాలీవుడ్లో దాదాపు 18 రోజులుగా కొనసాగుతున్న సమ్మెకు తెరపడింది. నిర్మాతలు, ఫిల్మ్ ఛాంబర్, ఫెడరేషన్ మధ్య చర్చలు సఫలమై, శుక్రవారం నుంచి అన్ని షూటింగ్స్ మళ్లీ ప్రారంభం కానున్నాయి.
సినీ కార్మికులు 30% వేతన పెంపు కోసం సమ్మె చేసిన విషయం తెలిసిందే. ఎన్నో రోజుల చర్చల తర్వాత, చివరకు 22.5% వేతన పెంపుపై రెండు వర్గాలు అంగీకరించాయి. ఈ నేపథ్యంలో రూ.2,000 లోపు వేతనం ఉన్న వారికి: తొలి ఏడాది 15%, రెండో ఏడాది 2.5%, మూడో ఏడాది 5%
, రూ.2,000 – రూ.5,000 మధ్య వేతనం ఉన్న వారికి: తొలి ఏడాది 7.5%, రెండో ఏడాది 5%, మూడో ఏడాది 5% చొప్పున ఇవ్వడానికి లేబర్ కమిషనర్ గంగాధర్ ఆధ్వర్యంలో జరిగిన చర్చల్లో ప్రిన్సిపల్ సెక్రటరీ నేతృత్వంలో ప్రత్యేక కమిటీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా ఇతర చిన్న సమస్యలను పరిష్కరించేందుకు ఈ కమిటీ నెల రోజుల్లో నివేదిక ఇవ్వనుంది.
ఈ సందర్భంగా ఎఫ్డిసి ఛైర్మన్ దిల్ రాజు మాట్లాడుతూ.. “ఫెడరేషన్ నాయకులు, నిర్మాతలు అర్థం చేసుకొని ముందుకు వచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరగా పరిష్కారం తీసుకురమ్మని సూచించారు. పరిశ్రమ అభివృద్ధి కోసం ప్రభుత్వం అందిస్తున్న సహకారం అభినందనీయమని” తెలిపారు.
చిరంజీవి కృతజ్ఞతలు
మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. “ఎంతో జటిలమైన ఇండస్ట్రీ సమస్యను సుహృద్భావంగా నిర్మాతలకు, కార్మికులకు సమన్యాయం జరిగే విధంగా పరిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. హైదరాబాద్ను ప్రపంచ స్థాయి ఫిల్మ్ హబ్గా తీర్చిదిద్దాలన్న ఆయన ఆలోచనలు ప్రశంసనీయం. తెలుగు సినిమా అభివృద్ధి కోసం అందరం కలిసికట్టుగా ముందుకు సాగుదాం” అని అన్నారు.