Upasana Konidela: మెగా ఫ్యామిలీ ‘డబుల్’ సెలబ్రేషన్స్.. అల్లు ఫ్యామిలీ ఎక్కడ
ABN, Publish Date - Oct 24 , 2025 | 04:06 PM
మెగా పవర్స్టార్ రామ్చరణ్, ఉపాసన దంపతులు మరోసారి తల్లిదండ్రులు కాబోతున్న విషయం తెలిసిందే. దీంతో చిరంజీవి ఇంట్లో దీపావళి సెలబ్రేషన్స్తోపాటు ఉపాసన సీమంతం వేడుకలు ఇటీవల చిరు ఇంట్లో జరిగాయి.
మెగా పవర్స్టార్ రామ్చరణ్ (Ram Charan), ఉపాసన దంపతులు మరోసారి తల్లిదండ్రులు కాబోతున్న విషయం తెలిసిందే. దీంతో చిరంజీవి (Chiranjeevi) ఇంట్లో దీపావళి సెలబ్రేషన్స్తోపాటు ఉపాసన సీమంతం వేడుకలు ఇటీవల చిరు ఇంట్లో జరిగాయి. ఆ వీడియోను ఉపాసన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తూ డబుల్ ప్రేమ, డబుల్ బ్లెస్సింగ్స్, డబుల్ సెలబ్రేషన్స్ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఎంతో వైభవంగా జరిగిన ఈ వేడుకలో మెగా కుటుంబంతోపాటు టాలీవుడ్ సినీ ప్రముఖులు సందడి చేశారు. హీరో వెంకటేష్ సతీమణితో హాజరవ్వగా.. మరో హీరో నాగార్జున కూడా తన ఫ్యామిలీతో వచ్చారు. అలాగే ప్రస్తుతం చిరు సరసన నటిస్తున్న నయనతార తన భర్త పిల్లలతో కలిసి హాజరై సందడి చేశారు. అలాగే నాగబాబు ఫ్యామిలీ, వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి, వైష్ణవ్ తేజ్, పవన్ సతీమణి అన్నా లెజనోవా సహా మరికొందరు హాజరయ్యారు. (Allu Fmaily miss)
అయితే ఈ వేడుకలో అల్లు కుటుంబానికి సంబంధించిన ఏ ఒక్కరూ కనిపించలేదు. అరవింద్, ఆయన సతీమణి, కుమారులు, కోడళ్ళు, మనవలు, మనవరాళ్లల్లో ఒక్కరూ ఉపాసన బేబీ షవర్ గింప్స్లో లేరు. దీంతో మళ్లీ ఇరు కుటుంబాల మధ్య గ్యాప్ ఏమైనా చోటు చేసుకుందా అని ఆరాలు మొదలుపెట్టారు నెటిజన్లు. అయితే మరోలా కూడా నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు. ఇటీవల దివంగత అల్లు రామలింగయ్య సతీమణి కనక రత్నమ్మ కన్నుమూసిన విషయం తెలిసిందే. హిందూ సంప్రదాయం ప్రకారం.. సంవత్సరం వరకు శుభాకార్యాలకు హాజరు కాకూడదని నమ్ముతారు. అందుకే అల్ల్లు కుటుంబసభ్యులు సీమంతానికి రాలేదమోనని అనుకుంటున్నారు. మరికొందరు మాత్రం ఇటీవల మెగా డాటర్ సుస్మిత తన నివాసంలో దుర్గా పూజ చేయగా అల్లు అరవింద్ కుటుంబ సభ్యులు హాజరయ్యారని గుర్తు చేస్తున్నారు. అల్లు అరవింద్ తల్లి మరణించిన కొన్ని రోజులకే దసరా రాగా.. వారంతా సుస్మిత ఇంట జరిగిన పూజకు హాజరైనప్పుడు, దీపావళి, ఉపాసన సీమంతానికి రాలేకపోవడానికి కారణమేంటని చర్చ మొదలుపెట్టారు. అయితే కారణాలు ఏంటనేది ఇరు కుటుంబాలు నోరు విప్పితే కాని తెలీదు.