Manchu Vishnu: విడుదల తర్వాత 'కన్నప్ప' కథ నాది అవుతుంది
ABN, Publish Date - Jun 26 , 2025 | 07:22 PM
కన్నప్ప కల్పితం కాదు.. చరిత్ర.. మన చరిత్ర. మన మధ్యలో జీవించినవాడు ఆ శివుడి ఆశీస్సులతో ఈ శుక్రవారం నాది అవుతుంది అన్నారు విష్ణు.
'కన్నప్ప’ (Kannappa) సినిమా విడుదలైన వెంటనే వ్యక్తిగతంగా కలిసి పవన్కల్యాణ్కు (pawan Kalyan) సినిమా చూపిస్తాం. మనకు తెలిసిన పవన్ కల్యాణ్ వేరు. ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా ఆయనపై రాష్ట్రం బాధ్యత ఉంది. తప్పకుండా ఆయన సమయం తీసుకుని సినిమా చూపించాలి. నటుడిగా ఆయన నాకు సీనియర్. ఆయన ప్రశంసలు ఎలా ఉంటాయనే దాని కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’’ అని మంచు విష్ణు (Manchu Vishnu) అన్నారు. ఆయన కీలక పాత్రలో ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన చిత్రం ుకన్నప్ప’ ఈ నెల 27న ఈ చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర బృందం మీడియాతో మాట్లాడారు. అడ్వాన్స్ బుకింగ్లో గడిచిన 24 గంటల్లో 1,15,000లకు పైగా టికెట్లు అమ్ముడుపోయాయని, అందుకు ఆనందంగా ఉందని ఇదంతా శివలీలేనని విష్ణు అన్నారు. ‘కన్నప్ప’ కథ కల్పితం కాదు. కన్నప్ప ఉన్నారు.. ఇప్పటికీ ఆయన్ను ఆరాధిస్తుంటారు. మళ్లీ చెబుతున్నాను ‘కన్నప్ప’ కల్పితం కాదు.. చరిత్ర.. మన చరిత్ర. మన మధ్యలో జీవించినవాడు’ ఆ శివుడి ఆశీస్సులతో ఈ శుక్రవారం నాది అవుతుంది అన్నారు విష్ణు.
భగవంతుడికి, భక్తుడికి మధ్య మధ్యవర్తులు సంప్రదాయాలు అవసరం లేదు. మూఢ నమ్మకాలు అంతకన్నా అవసరం లేదు. మనసారా దేవుణ్ణి ప్రార్థిస్తే ఆయన మనకు దగ్గరవుతారనేది ఈ సినిమా పూర్తి సారాంశం. ప్రేక్షకులకు ఉత్తమ సినిమా అందించాలనేది నేను పెట్టుకున్న రూల్. అదే ఈ సినిమా. ‘కన్నప్ప’ మీద ఇంత పాజిటివిటీ వస్తుందని ప్రారంభంలో ఎవ్వరూ నమ్మలేదు. అది వారి తప్పు కాదు. ఇప్పుడు ‘కన్నప్ప’ మీద ఫుల్ పాజిటివిటీ వచ్చింది. ‘కన్నప్ప’ చిత్రాన్ని ఫ్యామిలీ అంతా కలిసి హాయిగా చూడాలని కోరుకుంటున్నాను. రిలీజ్ టెన్షన్ ఏమీ లేదు. 10 వారాల ముందు నా సినిమా ఓటీటీలో రాకూడదు. అందుకే ఓటీటీ డీల్ పక్కనపెట్టాను. కన్నప్ప-2 రావాలంటే ఫిక్షనల్ స్టోరీ రాయాల్సిందే.
ఈతరం ప్రేక్షకులకు చెప్పాలనుకున్నా..
ఈ సినిమా చూసిన సెన్సార్ బోర్ట్ మెంబర్స్కు ధన్యవాదాలు. మాకెంతో సపోర్ట్ చేశారు. ఈ సినిమా విషయంలో ఎదురైన సవాళ్లు ఏంటంటే.. తెలుగ ప్రేక్షకులకు కన్నప్ప కథ తెలుసు. ఉత్తరాది వారికి ఈ కథ చెప్పాలనుకున్నప్పుడు ఇందులో కొన్ని సన్నివేశాలు చూపించాల్సి ఉంది. వాటిని సెన్సార్ టీమ్ అంగీకరించలేదు. అందుకోసం ఫైట్ చేయాల్సి వచ్చింది. ఈతరం ప్రేక్షకులకు మన కథలు, పురాణ ఇతిహాసాలు తెలియాలనేది నా కోరిక. ఇలాంటి సన్నివేశాలు ఉంటే ఉత్తరాదిలో వివాదాలు తలెత్తవచ్చని చెప్పారు. ఆ విధంగా ఎన్నో చర్చలు జరిపి వారు అడిగిన విధంగా స్వల్ప మార్పులు చేశాం. సంభాషణలు మార్చాం.
ప్రభాస్తో అది సాధ్యపడలేదు..
ఇక టికెట్ ధరల పెంపు గురించి మాట్లాడుతూ తెలంగాణలో టికెట్ ధరల పెంపు లేదు. ఏరోజు అయితే థియేటర్లలో పాప్కార్న్, కూల్ డ్రింక్స్ ధరలు తగ్గుతాయో.. ఆరోజు మల్టీప్లెక్సుల్లో ధరలు పెంచడం గురించి ఆలోచిస్తా. ఎందుకంటే, ఇది కుటుంబ సభ్యులతో చూడాల్సిన సినిమా. అందుకే ధరలు పెంచి ఇబ్బందిపెట్టాలనుకోవడం లేదు. ఆంధ్రప్రదేశ్లోనూ కొన్ని సెంటర్స్లో మాత్రమే రూ.50 పెంచాలని కోరాం. సినిమాలు చూడటం వల్లే నేను ఎన్నో గొప్ప కథలు తెలుసుకున్నా. ఇక ప్రభాస్కు మొహమాటం. ఈ సినిమాలో ఆయన భాగం కావడం ఆయనకు రుణపడి ఉంటా. ప్రభాస్ మనస్తత్వం నాకు బాగా తెలుసు. ఆయన్ని ఇబ్బందిపెట్టే పనులు చేయడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. ఓ వీడియో బైట్ పంపిస్తానన్నారు. అనివార్య కారణాల వల్ల అదీ సాధ్యపడలేదు. తన వల్లే ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నాం. ఇందులో తన రోల్ సుమారు 40 నిమిషాలు ఉంటుంది. కేరళలో ఈ చిత్రాన్ని సుమారు 300 థియేటర్లలో విడుదల చేస్తున్నారు. మోహన్లాల్ వల్లే అక్కడ ఆ స్థాయిలో విడుదల అవుతోంది. ఆయన రోల్ అద్భుతంగా ఉంటుంది.
ఆ లేఖ అందుకే..
సినిమా బతకాలనేది నా ఉద్దేశం. క్రియేటివిటీ, టాలెంట్ను దెబ్బతీయకూడదనే ఉద్దేశంతోనే ఆ నోటీస్ రిలీజ్ చేశా. ఇప్పటికే పలు రాష్ట్రాల రివ్యూవర్స్కు ఈ సినిమా చూపించాను. నార్త్లో ముగ్గురు రివ్యూవర్స్ ఈ సినిమా చూశారు. నన్ను ప్రేమగా హత్తుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. సినిమా గురించి ప్రేక్షకులకు చెప్పాలనే ఉద్దేశంతో ముందే రివ్యూలు ఇచ్చేశారు. దాంతో సోషల్మీడియాలో కొంతమంది వ్యక్తులు రివ్యూలు రాశారు. సినిమా బాలేదంటూ పోస్టులు పెట్టారు. వారిని దృష్టిలో ఉంచుకునే నిన్న పోస్ట్ పెట్టాం. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించాం. అంతేకానీ హెచ్చరికలు జారీ చేసే స్థాయిలో నేను లేను. ఈ సినిమా ఇంత భారీ సినిమా అవుతుందని ఎవరూ అనుకోలేదు.