మా తెలుగు తల్లికి... మల్లెపూదండ వేసిన ఆ ఇద్దరు...
ABN, Publish Date - Jun 26 , 2025 | 07:39 PM
తెలుగు భాషను అమృతంగా భావించి, తెలుగునేలను తల్లిగా పూజించడం తెలుగువారి సంస్కారానికి నిదర్శనం. దీనిని దృష్టిలోపెట్టుకొనే ఎందరో తెలుగు కవులు పద్యాలు, గేయాలు, గీతాలు, పాటలు పలికించారు.
తెలుగు భాషను అమృతంగా భావించి, తెలుగునేలను తల్లిగా పూజించడం తెలుగువారి సంస్కారానికి నిదర్శనం. దీనిని దృష్టిలోపెట్టుకొనే ఎందరో తెలుగు కవులు పద్యాలు, గేయాలు, గీతాలు, పాటలు పలికించారు. ఆ సాహిత్యమంతా తెలుగుతల్లి కీర్తికిరీటంలో రత్నాలుగా వెలుగొందుతూనే ఉన్నాయి. అందులో మేలిమి రత్నంగా ఈ నాటికీ భాసిస్తూ ఉన్న గీతం శంకరంబాడి సుందరాచారి (Sankarambaadi Sundarachary) రాసిన "మా తెలుగు తల్లికి మల్లెపూదండ..." అంటూ సాగే గేయమేనని చెప్పక తప్పదు. ఈ పాట తెలియని తెలుగువాడు ఉండడు. రాష్ట్రవిభజన సమయంలో ఈ పాటపై కొందరు ప్రాంతీయాభిమానులు విషం చిందించిన సంగతి తెలిసిందే. కానీ, 'కవి వాక్కులందు కలదు అమృతం...' అన్న మాటను వారు మరచిపోయారు. శంకరంబాడి రాసిన 'మా తెలుగు తల్లికి... మల్లెపూదండ...' పాటను మాత్రం ఎవరూ తప్పు పట్టరు. అందులోని అమృతాన్ని తెలుగువారు సదా ఆస్వాదించడానికే తపిస్తారు. ఆ పాటను తెలుగునేల పులకించేలా తొట్టతొలుత గానం చేసిన ఘనత నిస్సందేహంగా టంగుటూరి సూర్యకుమారి (Tanguturi Surya Kumari)కి దక్కుతుంది. ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు వారి కుటుంబం నుంచే టంగుటూరి సూర్యకుమారి వచ్చారు. ఆమె స్వరాజ్య పోరాటంలో పాలుపంచుకున్నారు. గూడవల్లి రామబ్రహ్మం తెరకెక్కించిన 'రైతుబిడ్డ' (Rythu Bidda) (1939)లో ప్రఖ్యాత రంగస్థల నటులు బళ్ళారి రాఘవ నర్సిరెడ్డి పాత్ర పోషించగా, ఆయన కూతురు సీత పాత్రలో సూర్యకుమారి అభినయించారు. ఆ చిత్రంలో సూర్యకుమారి పాడిన "రావోయి వనమాలి... బిరబిర రావోయి..." అంటూ సాగే గీతం అప్పట్లో విశేషాదరణ చూరగొంది.
నిజానికి 'మా తెలుగు తల్లికి మల్లెపూదండ...' పాటను ఓ సినిమా కోసం శంకరంబాడి సుందరాచారితో రాయించారు. అయితే సదరు చిత్ర సంగీత దర్శకునికి ఆ పాట నచ్చలేదు. దానిని పక్కన పడేశారు. ఎంతో సౌమ్యుడైన సుందరాచారి తన పాట నిర్మాతలకు నచ్చలేదని ఊరుకున్నారు. ఓ సందర్భంలో ఆ సినిమా ఆఫీసుకు సూర్యకుమారి వెళ్ళారు. అక్కడ ఓ కాగితం కనిపించింది. దానిపై రాసిన 'మా తెలుగు తల్లికి మల్లెపూదండ...' పాట ఆమెను ఎంతగానో ఆకర్షించింది. ఆ పాటను తరువాత కొందరు సంగీతజ్ఞులతో కలసి స్వరపరచి స్వయంగా ఆలపించారు సూర్యకుమారి. ఆ పాట ఓ వేదికపై సూర్యకుమారి గానం చేస్తూ ఉండగా, అటుగా వెళ్తోన్న సుందరాచారి చెవుల పడింది. అది తాను రాసిన పాట అంటూ సుందరాచారి అటుగా పరుగులు తీశారట. తరువాత 'మా తెలుగు తల్లికి...మల్లెపూదండ..." పాట ఎంత సుప్రసిద్ధమయిందో అందరికీ తెలుసు. కానీ, ఆ గీతాన్ని రాసిన శంకరంబాడి సుందరాచారి మాత్రం ఎవరికీ తెలియకుండానే కాలగర్భంలో కలిసిపోయారు. అయితేనేం ఎన్నో వేదికలపై సూర్యకుమారి 'మా తెలుగుతల్లికి...' గీతాన్ని ఆలపించి ఆ పాటకు పట్టాభిషేకం చేశారు. తరువాతి రోజుల్లో సూర్యకుమారి లండన్ వెళ్ళి స్థిరపడ్డారు.
1975లో జరిగిన ప్రప్రథమ ప్రపంచ తెలుగు మహాసభలకు నిర్వాహకులు సూర్యకుమారిని ఆహ్వానించారు. ఆ సందర్భంలో "మా తెలుగు తల్లికి మల్లెపూదండ..." గీతాన్ని మరోమారు శ్రావ్యంగా పాడి అక్కడ ఉన్నవారందరినీ అలరించారు సూర్యకుమారి. మాతృభాష తెలుగంటే ప్రాణం పెట్టే నటరత్న యన్టీఆర్ (NTR) కూడా ఆ మహాసభలకు హాజరయ్యారు. ఆ సందర్భంలో సూర్యకుమారిని యన్టీఆర్ కలుసుకొని కాసేపు ముచ్చటించారు. తరువాత యన్టీఆర్ రాజకీయ ప్రవేశం చేసిన తరువాత 1982లో 'మా తెలుగు తల్లికి మల్లెపూదండ...' పాటను చక్రవర్తి బాణీల్లో పి.సుశీల చేత గానం చేయించారు. ఆ రోజుల్లో 'తెలుగుదేశం' పార్టీ ఎన్నికల ప్రచారంలో ఆ పాట విశేషాదరణ చూరగొంది. ఆ పాట వినిపించగానే జనం 'జై తెలుగుదేశం' అంటూ ఇళ్ళలోంచి పరుగులు తీస్తూ వచ్చి ప్రచారం చేసేవారి చుట్టూ మూగేవారు. ఇక ఇదే పాట - యన్టీఆర్ చైతన్య రథం లోనూ వినిపించేది. ఆ పాట వినిపిస్తూ యన్టీఆర్ చేసిన ప్రచారం అప్పట్లో అత్యంత విశేషంగా నిలచింది.
'మా తెలుగుతల్లికి మల్లెపూదండ...' అంటూ మొట్టమొదట అలపించిన టంగుటూరి సూర్యకుమారి, తెలుగువారి ఆత్మగౌరవ పరిరక్షణ నినాదంతో ప్రప్రథమ కాంగ్రేసేతర ముఖ్యమంత్రిగా తెలుగునేలపై నిలచిన నందమూరి తారక రామారావు కలుసుకున్న ఛాయాచిత్రం ఈ మధ్య విశేషంగా అంతర్జాలంలో దర్శనమిస్తోంది.