Jayaprada: 'జయప్రదం' గా సాగిన లలితా రాణి!
ABN, Publish Date - Jun 21 , 2025 | 07:57 PM
ఈ ఫొటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు లలితా రాణి (Lalitha Rani). అప్పుడామె వయసు కేవలం 13 సంవత్సరాలు. పట్టు పరికిణి కట్టి ఓణీ వేసిన అమ్మడు మరో రెండేళ్ళకు వెండితెరపై 'భూమికోసం' (Bhoomi Kosam) సినిమాలో 'చెల్లి చంద్రమ్మ'గా కనిపించింది.
Jayaprada: ఈ ఫొటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు లలితా రాణి (Lalitha Rani). అప్పుడామె వయసు కేవలం 13 సంవత్సరాలు. పట్టు పరికిణి కట్టి ఓణీ వేసిన అమ్మడు మరో రెండేళ్ళకు వెండితెరపై 'భూమికోసం' (Bhoomi Kosam) సినిమాలో 'చెల్లి చంద్రమ్మ'గా కనిపించింది. తరువాత 'నాకూ స్వతంత్రం వచ్చింది'లో నటించింది. ఆ సినిమాను నటుడు డాక్టర్ ప్రభాకర్ రెడ్డి నిర్మించారు. 'జయప్రద మూవీస్' పతాకంపై చిత్రాలు నిర్మించి నటించారు. అందులో సూపర్ డూపర్ హిట్ మూవీ 'పండంటి కాపురం' (1972). తన బ్యానర్ లో నటిస్తోన్న లలితా రాణిని కాస్త 'జయప్రద' (Jayaprada) గా మార్చారు ప్రభాకర్ రెడ్డి. ఆయన పేరు మార్చిన వేళావిశేషమేంటో కానీ, జయప్రద కెరీర్ పేరుకు తగ్గట్టుగానే జయప్రదంగా సాగింది. విఖ్యాత భారతీయ దర్శకుడు సత్యజిత్ రే సైతం జయప్రద అందమైన మోము చూసి "ద మోస్ట్ బ్యూటిఫుల్ ఫేస్ ఆన్ ది ఇండియన్ స్క్రీన్" అంటూ కితాబు నిచ్చారు.
ఉత్తరాదిన జయకేతనం ఎగురవేయక ముందే దక్షిణాదిన జయప్రద నటిగా తనదైన బాణీ పలికించారు. పిన్న వయసులోనే 'అంతులేని కథ' (1976)లో సరిత పాత్రకు ప్రాణం పోసి మెప్పించారు. కె.బాలచందర్ అంతకు ముందు తమిళంలో తాను తీసిన 'అవళ్ ఒరు తోడర్ కథై' ఆధారంగా 'అంతులేని కథ'ను తెలుగులో రూపొందించారు. తమిళంలో సుజాత ధరించిన పాత్రను తెలుగులో జయప్రద పోషించారు. అప్పటికే పలు మళయాళ చిత్రాల్లో నటించిన అనుభవంతో తమిళంలో తొలిసారి 'అవళ్ ఒరు తోడర్ కథై'లో నటించారు సుజాత. అందులో సుజాత వంటి సీనియర్ పోషించిన బరువైన పాత్రను టీనేజ్ లో ఉన్న జయప్రద ఏ మేరకు మెప్పిస్తుందోనని అందరూ ఆసక్తిగా చూశారు. వారందరినీ తనదైన అభినయంతో ఆకట్టుకున్నారు జయప్రద. ఆపై బాపు 'శ్రీరాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్', 'సీతాకళ్యాణం'లోనూ జయప్రద అందాల అభినయం జనానికి బంధం వేసింది.
ఇక కె.విశ్వనాథ్ 'సిరిసిరిమువ్వ'లో హైమ పాత్రతో నటిగా మరిన్ని మార్కులు సంపాదించిన జయప్రద 'అడవిరాముడు' (1977) అఖండ విజయంతో స్టార్ హీరోయిన్ అనిపించుకున్నారు. ఆ తరువాత తన దరికి చేరిన చిత్రాలలో మురిపిస్తూ సాగిన జయప్రద దక్షిణాదిన తమిళ, కన్నడ చిత్రాల్లోనూ అలరించారు. విశ్వనాథ్ దర్శకత్వంలో తాను నటించిన 'సిరిసిరిమువ్వ' హిందీ రీమేక్ 'సర్గమ్' (1979)తో హిందీ చిత్రసీమకు పరిచయమయ్యారు జయప్రద. ఆ సినిమా ఘనవిజయంతో బాలీవుడ్ లోనూ దూసుకుపోయారు.
వందలాది చిత్రాల్లో నటించి మెప్పించిన జయప్రదను దక్షిణాదివారి కంటే ఉత్తరాదివారే ఎక్కువగా అభిమానించారని చెప్పవచ్చు. యన్టీఆర్ నెలకొల్పిన 'తెలుగుదేశం' పార్టీ తరపున రాజ్యసభకు ఎన్నికైన జయప్రద తరువాత ఉత్తరాదిన 'సమాజ్ వాది పార్టీ'తో సాగారు. ఉత్తర్ ప్రదేశ్ లోని రామ్ పూర్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి 2004, 2009 ఎన్నికల్లో వరుసగా ఘనవిజయం సాధించారు. 2014లో బిజ్నోర్ నుండి పార్లమెంట్ కు పోటీ చేసి ఓటమి చవిచూశారు. ఇప్పటికీ తన దరికి చేరిన పాత్రల్లో నటించడానికి జయప్రద ఉత్సాహం ప్రదర్శిస్తూనే ఉన్నారు. రాజేంద్రప్రసాద్ తో కలసి జయప్రద నటించిన 'లవ్ ఎట్ 65' చిత్రం విడుదల కావలసి ఉంది.
ఈ ఫొటోలో ముగ్ధమనోహరంగా కనిపిస్తున్న లలితా రాణి - జయప్రదగా సాగిన తీరును తలచుకుంటే ఈమేనా ఇన్ని విజయాలు సాధించింది అనిపించక మానదు. ఏది ఏమైనా లేలేత అందాల లలితా రాణి ఫొటో జయప్రద అభిమానులకు ఆనందం పంచక మానదు.
Sarathkumar: కన్నప్పలో మా తండ్రీకొడుకుల బంధం అద్భుతంగా ఉంటుంది