Kannappa: శ్రీశైలం మల్లన్న చెంత.. కన్నప్ప
ABN, Publish Date - Jun 25 , 2025 | 05:26 PM
సినిమా విడుదల దగ్గర పడుతుండడంతో విష్ణు సహా పలువురు టీం మెంబర్స్ బుధవారం శ్రీశైలం మల్లన్నను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మంచు విష్ణు (Vishnu Manchu) కన్నప్ప (Kannappa) మరో రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా విడదల కానుంది.ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రచార కార్యక్రమాలు ఫుల్ స్వింగ్లో ఉండగా అయా రాష్ట్రాలలో ఈవెంట్లు సైతం నిర్వహించి మూవీపై హైప్ పెంచారు. ఈక్రమంలో సినిమా విడుదల దగ్గర పడుతుండడంతో విష్ణు సహా పలువురు టీం మెంబర్స్ బుధవారం శ్రీశైలం మల్లన్నను (Sri Sailam Mallikarjuna Swamy Temple) దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన పూజలు చేశారు. ఆపై అమ్మవారి ఆశీర్వచన మండపంలో పండితులు ఆశీర్వదించగా, అర్చకులు తీర్థ ప్రసాదాలను అందజేశారు.
ఈ సందర్భంగా మంచు విష్ణు మాట్లాడుతూ కన్నప్ప సినిమా విజయవంతం కావాలని కోరుకుంటూ శ్రీశైలం మల్లికార్జునస్వామి దర్శనంతో నా 12 జ్యోతిర్లింగాల యాత్ర పూర్తి చేసినట్లు తెలిపారు. శుక్రవారం 27వ తేదీన కన్నప్ప చిత్రం తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదలవుతుందని.. ప్రజలందరూ కన్నప్ప సినిమాను ఆదరిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నా అన్నారు. రుద్ర పాత్రలో ప్రభాస్, కిరాత వేషంలో మోహన్లాల్, పరమశివుడిగా అక్షయ్కుమార్, పార్వతి దేవిగా కాజల్ అగర్వాల్, మహదేవ శాస్త్రిగా మోహన్బాబు పాత్రలు మెప్పిస్తారన్నారు.
ఇదిలాఉంటే.. గత సంవత్సరం రిలీజ్ టీజర్ తీవ్ర విమర్శలు రాగా ఆపై మేలుకున్న మేకర్స్ మరో టీంతో సీజీ వర్క్స్ చేయించారు. అనంతరం సినిమా నుంచి విడుదల చేసిన పాటలు ప్రేక్షకుల్లో మంచి ఆదరణను దక్కించుకుని క్రమంగా సినిమాపై అంచనాలు పెరిగేలా చేశారు. ఈ క్రమంలోనే రిలీజ్ చేసిన ట్రైలర్ సైతం సినిమాపై ఉన్న అన్ని అనుమానాలను పటా పంచలు చేస్తూ అంతటా మంచి హైప్ తీసుకువచ్చాయి. అదీగాక సుమారు 5 దశాబ్దాల తర్వాత మరో కన్నప్ప సినిమా వస్తుండడంతో జనాల్లోనూ ఆసక్తి నెలకొంది.