Bunny Vas On Raju Weds Rambai: ఐ బొమ్మ.. క్లోజ్ అవడం కలిసొచ్చింది! మా పెట్టుబడికి.. నాలుగు రెట్ల లాభం
ABN, Publish Date - Nov 25 , 2025 | 08:29 AM
కొన్ని సినిమాలకు కలెక్షన్స్ చెప్పలేం. కానీ ఈ ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాకు మాత్రం వసూళ్లు చెప్పాలని అనిపించిందని అన్నారు నిర్మాతలు బన్నీ వాస్, వంశీ నందిపాటి.
‘రాజు వెడ్స్ రాంబాయి’ (Raju Weds Rambai)సినిమా మేము ఊహించినదాని కంటే పెద్ద విజయాన్ని సాధిస్తోంది. కొన్ని సినిమాలకు కలెక్షన్స్ చెప్పలేం. కానీ ఈ సినిమాకు మాత్రం వసూళ్లు చెప్పాలని అనిపించింది’ అని అన్నారు నిర్మాతలు బన్నీ వాస్ (Bunny Vas), వంశీ నందిపాటి (Vamsi Nandipati). అఖిల్ రాజ్ (Akhil Raj), తేజస్విని (Tejaswini) జంటగా సాయిలు కంపాటి (Saailu Kampati) తెరకెక్కించిన చిత్రమిది. వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవీ నిర్మించారు. వంశీ నందిపాటి ఎంటర్టైన్మెంట్స్, బన్సీ వాస్ వర్క్స్ బేనర్లపై బన్నీ వాస్, వంశీ నందిపాటి ఈ చిత్రాన్ని విడుదల చేశారు. ప్రేక్షకుల ముందుకు ఇటీవలె వచ్చిన ఈ సినిమా భారీ వసూళ్లతో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బన్సీ వాస్ మాట్లాడుతూ ‘మూడు రోజుల్లో ఈ సినిమాకు రూ.7.28 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు దక్కాయి. వీటిలో కేవలం నైజాం నుంచే ఐదు కోట్ల రెండు లక్షలు వసూలు అయ్యాయి. తెలంగాణలోని మల్టీప్లెక్స్ల కంటే సింగిల్ స్క్రీన్స్ నుంచే ఎక్కువ కలెక్షన్లు వచ్చాయి.
ఐ బొమ్మ క్లోజ్ అవడం, టికెట్కు రూ.99 ధర పెట్టడం కూడా మా కలెక్షన్లు పెరిగేందుకు కలిసొచ్చింది అని చెప్పారు. వంశీ నందిపాటి మాట్లాడుతూ ‘మా పెట్టుబడికి నాలుగు రెట్ల లాభం వస్తుందని ఆశిస్తున్నాం. ఏపీతో పోల్చితే నైజాంలో కలెక్షన్స్ ఎక్కువగా ఉన్నాయి. మల్టీప్లెక్స్తో పాటు బీ, సీ సెంటర్లలో కూడా కలెక్షన్స్ బాగున్నాయి. టికెట్ రేటుని రూ.99గా ఫిక్స్ చేసుకుంటేనే సింగిల్ స్క్రీన్స్ కళకళ లాడతాయి. లేదంటే మూసివేయాల్సిన పరిస్థితులున్నాయి’ అని అన్నారు.