Raju Weds Rambai: ‘ఐ బొమ్మ’ ఎఫెక్ట్.. ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ రేట్లు తగ్గింపు
ABN , Publish Date - Nov 20 , 2025 | 01:27 PM
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో సినిమా పైరసీ, ‘ఐ బొమ్మ’ రవి (I Bomma Ravi) అరెస్టు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో సినిమా పైరసీ, ‘ఐ బొమ్మ’ రవి (I Bomma Ravi) అరెస్టు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. ఈ పరిణామాన్ని సినీ పరిశ్రమ మొత్తం స్వాగతిస్తున్నప్పటికీ, సోషల్ మీడియాలో మాత్రం అందుకు భిన్నంగా ఉంది. ముఖ్యంగా టికెట్ ధరలు, థియేటర్లలో తినుబండారాల ధరల పెరుగుదలపై ప్రేక్షకుల అసంతృప్తి బహిరంగంగా వ్యక్తమవుతోంది.
ఈ నేపథ్యంలో రాబోయే ‘రాజు వెడ్స్ రాంబాయి’ (Raju Weds Rambai) చిత్ర యూనిట్ అనూహ్య నిర్ణయం ఇప్పుడు హౄట్ టాపిక్ అయింది. ప్రముఖ ఓటీటీ సంస్థ ఈటీవీ విన్ ప్రొడక్షన్లో రూపొందిన ఈ చిత్రాన్ని బన్నీ వాసు, వంశీ నందిపాటి విడుదల చేస్తున్నారు. నవంబర్ 21న థియేటర్లకు రానున్న ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ సందర్భంగా ఈ చిత్రం టికెట్ ధరలను తగ్గిస్తున్నట్టు టీం ప్రకటించింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పైరసీపై మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. ‘క’ సినిమా పైరసీని మా ప్లాట్ఫామ్ నుంచి అడ్డుకున్నాం. ఇప్పుడు ‘ఐ బొమ్మ’ రవి అరెస్టు కూడా మంచి సంకేతమే. ఆయనను పట్టుకున్న పోలీసు అధికారులకు అభినందనలని తెలిపారు. థియేటర్లలో టికెట్ ధరలు, ఫుడ్ & వాటర్ ధరలు పెరిగిపోయాయని ప్రజలు చెబుతున్నారు. అందుకే మా చిత్రాన్ని సింగిల్ స్క్రీన్స్లో ₹99కు, మల్టీప్లెక్సుల్లో ₹105కు మాత్రమే చూపించాలని నిర్ణయించాం అని ప్రకటించారు.
అయితే తాజాగా తీసుకున్న టికెట్ ధరల తగ్గింపు నిర్ణయం సినిమా కంటే ఎక్కువ చర్చనీయాంశంగా మారింది.‘ఐ బొమ్మ’ రవి అరెస్టు, పైరసీ, టికెట్ ధరలు, థియేటర్ ఫుడ్ రేట్లు.. ఈ మొత్తం చర్చ మధ్యలో ‘రాజు వెడ్స్ రాంబాయి’ టీం తీసుకున్న నిర్ణయం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది.