Hushaaru: మళ్లీ హుషారుగా థియేటర్లలోకి...

ABN , Publish Date - Jun 26 , 2025 | 11:20 AM

యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన 'హుషారు' చిత్రం విడుదలై ఏడేళ్ళు గడుస్తోంది. ఇప్పుడు మరోసారి ఈ మూవీని జనం ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు నిర్మాతలు.

యువతను నవ్వించి, వివిధ భావోద్వేగాలతో మనసును హత్తుకున్న చిత్రం 'హుషారు' (Hushaaru). 2018లో తొలిసారి ఈ సినిమా జనం ముందుకు వచ్చింది. ఈ సినిమా మరోసారి థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైంది. కాలేజీ రోజుల అనుభూతులను, స్నేహితుల మధ్య బంధాన్ని, యువత ఎదుర్కొనే సవాళ్ళను హాస్య, భావోద్వేగాలతో తీసిన 'హుషారు' చిత్రం జూలై 5న రీ-రిలీజ్ కానుంది.


ప్రముఖ నిర్మాత బెక్కెం వేణుగోపాల్ (Bekkem Venu Gopal), రియాజ్ నిర్మించిన ఈ సినిమాకు శ్రీహర్ష కొనుగంటి (Sree Harsha Konuganti) దర్శకత్వం వహించారు. మొదటి విడుదల సమయంలోనే ఈ చిత్రం యూత్‌లో భారీ క్రేజ్ తెచ్చుకుంది. ఇప్పుడు మళ్లీ అదే క్రేజ్‌తో థియేటర్లకు తిరిగి వస్తోంది. ఈ సినిమా విజయం సాధించడంతో అప్పట్లో ప్రముఖ నిర్మాత దిల్ రాజు దర్శకుడు శ్రీహర్ష తోనే 'రౌడీ బాయ్స్' మూవీ నిర్మించి దాని ద్వారా శిరీష్‌ తనయుడు ఆశిష్‌ రెడ్డిని హీరోగా పరిచయం చేశారు.

ఈ చిత్రంలో తేజస్ కంచెర్ల, తేజ్ కురపాటి, అభినవ్ మేడిశెట్టి, దినేష్ తేజ్ వంటి యువ నటులు పాత్రలు ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేశాయి. సంగీత దర్శకుడు రధన్ అందించిన పాటలు అప్పట్లో యువత ఫేవరెట్‌గా మారాయి. ఈ సినిమా విజయానికి పాటలూ దోహద పడ్డాయి. యువత జీవితాన్ని ప్రతిబింబించిన ఈ చిత్రం మళ్లీ ఒక మంచి అనుభూతిని అందించనుందని నిర్మాత బెక్కెం వేణుగోపాల్, రియాజ్ చెబుతున్నారు. మరి ఈ రీ-రిలీజ్ ఏ స్థాయిలో జనాలను ఆకట్టుకుంటుందో చూడాలి.

Also Read: Nenu Ready: ఫ్యామిలీ బొనాంజగా హవీష్ మూవీ

Also Read: Manchu Vishnu: కన్నప్ప కు కోపం తెప్పించకండి...

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - Jun 26 , 2025 | 11:23 AM