Siddhu Jonnalagadda: జాక్ దెబ్బ.. సిద్దు రెమ్యునరేషన్ వెనక్కి
ABN, Publish Date - Jun 04 , 2025 | 10:38 AM
ఇటీవల థియేటర్లలోకి వచ్చి ప్రేక్షకులను తీవ్రంగా నిరాశ పర్చిన చిత్రం జాక్. తాజాగా ఈ సినిమా విషయంలో హీరో కీలక నిర్ణయం తీసుకున్నాడు.
ఏప్రిల్లో థియేటర్లలోకి వచ్చి ప్రేక్షకులను తీవ్రంగా నిరాశ పర్చిన బారీ డిజాస్టర్గా నిలిచిన చిత్రం జాక్ (Jack). గతంలో అత్తారింటికి దారేది, విరూపాక్ష, నాన్నకు ప్రేమతో వంటి భారీ చిత్రాలను నిర్మించిన B. V. S. N. ప్రసాద్ (B. V. S. N. Prasad) తన శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర (Sri Venkateswara Cine Chitra) బ్యానర్పై ఈ చిత్రాన్ని నిర్మించారు. బొమ్మరిల్లు భాస్కర్ (Bommarillu Bhaskar) దర్శకత్వం వహించగా వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) హీరోయిన్గా ప్రకాశ్ రాజ్, నరేశ్ వంటి నటులు ప్రధాన పాత్రల్లో నటించారు.
రిలీజైన మొదటి రోజు నుంచే డివైడ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ. రూ. 30 కోట్లకు పైగా బడ్జెట్తో తెరకెక్కగా రూ.8,9 కొట్ల లోపు కలెక్షన్లను మాత్రమే రాబట్టి నిర్మాతకు భారీగా నష్టాలను తీసుకువచ్చింది. ముఖ్యంగా తెలంగాణలో బయ్యర్లు తీవ్ర నష్టాన్ని చూడాల్సి వచ్చింది. ఆపై ఓటీటీకి సైతం వచ్చిన ఈ జాక్ (Jack). చిత్రం భారీగా విమర్శలను మూట గట్టుకుంది. దీంతో సిద్దు కెరీర్కు ఈ సినిమా పెద్ద బ్రేక్ వేసినట్లైంది. ఈక్రమంలో హీరో సిద్ధు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. తనకు ఇచ్చిన రెమ్యునరేషన్లో సగం రూ. 4కోట్ల వరకు తిరిగి నిర్మాతకు ఇవ్వదలిచినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ రెండు రోజుల్లోనే ఈ పని కూడా జరుగనున్నట్లు సమాచారం.
ఇదిలాఉంటే.. సిద్దు జొన్నలగడ్డ నటించిన తెలుసు కదా (Telusu Kada) సినిమా మరో రెండు నెలల్లో విడుదల కావాల్సి ఉన్న నేపథ్యంలో ఆ చిత్రం బిజినెస్కు ఎలాంటి అడ్డంకులు రాకుండా ముందస్తుగా హీరో ఈ నిర్ణయం తీసకున్నట్లు ప్రచారం జరుగుతుంది. అయితే హీరో సెటిల్ చేసే అమౌంట్ విషయంలో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఆపై బయ్యర్లుకు ఏమేరకు చెల్లిస్తారనేది తెలియాల్సి ఉంది. ఇక.. సిద్ధు తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు దక్కుతుండగా ఇతర హీరోలు సైతం ఇలాంటి ఆలోచన చేస్తే బావుంటుందని హితవు పలుకుతున్నారు. కాగా ఈ జాక్ సినిమా ప్రస్తుతం నెట్ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.