Chiranjeevi: చిరంజీవి.. వీరాభిమాని నిరహార దీక్ష
ABN, Publish Date - Jun 25 , 2025 | 07:09 PM
సినీ అభిమానుల వ్యవహారం ఎప్పుడూ చర్చనీయాంశమే. అభిమానం ఎక్కువైనా, తమ హీరోపై ఎవరైనా నోరు జారినా ఆపై జరిగే చర్య ప్రతిచర్యలు ఓ రేంజ్లో ఉంటాయి.
టాలీవుడ్లో సినీ అభిమానుల వ్యవహారం ఎప్పుడూ చర్చనీయాంశమే. అభిమానం ఎక్కువైనా, తమ హీరోపై ఎవరైనా నోరు జారినా ఆపై జరిగే చర్య ప్రతిచర్యలు ఓ రేంజ్లో ఉంటాయి. అయితే వీరితో పాటు చాలామంది తమ అభిమాన హీరోను జీవితంలో ఒక్కసారైనా కలవడానికి ఏళ్ల తరబడి కలలు కంటూ జీవించేస్తుంటారు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు చాలామంది తమ హీరోలను కలవడానికి వంద కిలోమీటర్లు పాదయాత్రలు, సైకిల్ యాత్రలు చేయడం చూశాం. మరి కొంతమంది రక్త దానాలు, ఇతర సేవా కార్యక్రమాలు చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు మనం చూడబోయే అభిమాని కథ కూడా అలాంటిదే.
వివారాల్లోకి వెళితే.. మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) దర్శనం కావాలంటూ ఓ వీరాభిమాని ఏకంగా నిరహారదీక్షకు దిగి సంచలనం సృష్టించాడు. ఇప్పుడీ వార్త వైరల్ గా మారింది. ఉమ్మడి అనంతపురం (Anantapur) జిల్లా సోమందేపల్లి మండలం నల్లగొండ్రాయినిపల్లికి చెందిన రామకృష్ణ అనే వ్యక్తి చిరంజీవికి నాలుగు దశాబ్దాలుగా వీరాభిమాని. దీంతో ఆయన తన అభిమాన హీరోని కలిసేందుకు అనేక మార్లు ప్రయత్నం చేసి కుదరక పోవడంతో విసుగెత్తి తన కోరికను చిరంజీవి వద్దకు చేర్చేందుకు నిరాహార దీక్షనే మార్గమని ఎంచుకున్నాడు.
దీంతో.. ఈ విషయం కాస్తా సామాజిక మాధ్యమాల్లో హాల్చల్ అయింది. ఇదిలాఉంటే రామకృష్ణ తన అభిమాన హీరో చిరంజీవిని కలవాలనుకున్న కారణం తెలుసుకున్నాక ఆశ్చర్య పోవడం నెటిజన్ల వంతయింది. ఇంతకు ఆ కారణమేంటంటే రామకృష్ణ రెడీ చేసిన ఓ జానపద కథను చిరంజీవికి వినిపించాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఎంతకీ ఫలితం దొరక్కపోవడంతో ఇక నిరహార దీక్షకు దిగినట్లుగా వెల్లడించాడు.