AM Ratnam: పాత బాకీలు క్లియర్ చేయాలంటూ ఫిర్యాదు
ABN, Publish Date - Jul 20 , 2025 | 02:21 PM
ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నంపై (AM Ratnam) కొన్ని డిస్ట్రిబ్యూషన్ సంస్థలు తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (TFCC)లో ఫిర్యాదు చేశాయి.
ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నంపై (AM Ratnam) కొన్ని డిస్ట్రిబ్యూషన్ సంస్థలు తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (TFCC)లో ఫిర్యాదు చేశాయి. నైజాం ప్రాంతానికి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ ఒప్పందాల్లో రత్నం ఇవ్వాల్సిన మొత్తాన్ని ఇప్పటి వరకు చెల్లించలేదని సంస్థలు అభిప్రాయపడ్డాయి. 'ఆక్సిజన్' సినిమాకు సంబంధించిన సుమారు రూ.2.5 కోట్లు రికవరీ పెండింగ్లో ఉందని ఏషియన్ ఎంటర్ప్రైజెస్ సంస్థ తెలిపింది. ‘ముద్దుల కొడుకు’, ‘బంగారం’ సినిమాల కోసం రూ.90 వేల వరకు బాకీ ఉందని మహాలక్ష్మి ఫిల్మ్స్ సంస్థ పేర్కొంది. (Harihara Veeramallu)
ఈ వ్యవహారాన్ని ఛాంబర్ దృష్టికి తీసుకెళ్లిన డిస్ట్రిబ్యూషన్ సంస్థలు, రత్నం నిర్మించిన తాజా చిత్రం ‘హరి హర వీరమల్లు’ విడుదలకు ముందు తమ బాకీలు క్లియర్ చేయాలంటూ విజ్ఞప్తి చేశాయి. అంతేకాకుండా, ఇతర డిస్ట్రిబ్యూటర్లు ఈ విషయంలో మద్దతు ఇవ్వాలని కోరారు. పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన 'హరి హర వీరమల్లు' ఈ నెల 24న థియేటర్లలోకి రానుంది. ఈ సినిమాకు తొలుత క్రిష్ దర్శకత్వం వహించగా, మిగతా సగం భాగాన్ని రత్నం కుమారుడు జ్యోతికృష్ణ తెరకెక్కించారు. ఇందులో నిధి అగర్వాల్ కథానాయిక. సత్యరాజ్, బాబీ డియోల్, సునీల్, నాజర్ తదితరులు కీలక పాత్రధారులు.