సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

అవార్డు వచ్చినవాళ్లు స్వయంగా వచ్చి స్వీకరించాలి

ABN, Publish Date - Jun 16 , 2025 | 04:41 AM

‘ప్రభుత్వం నుంచి అవార్డ్స్‌ వస్తున్నాయంటే చాలా జాగ్రత్తగా పురస్కారాలను స్వీకరించాలి. ఇది ఇండస్ట్రీలోని అందరికీ చెబుతున్నాను. భవిష్యత్‌లో...

సినీ ప్రముఖులకు దిల్‌రాజు సూచన

‘ప్రభుత్వం నుంచి అవార్డ్స్‌ వస్తున్నాయంటే చాలా జాగ్రత్తగా పురస్కారాలను స్వీకరించాలి. ఇది ఇండస్ట్రీలోని అందరికీ చెబుతున్నాను. భవిష్యత్‌లో ప్రభుత్వ పురస్కారాల ప్రకటన వచ్చినప్పుడు ఆ తేదీని డైరీలో నోట్‌ చేసుకొని... అవార్డు వచ్చినవాళ్లు స్వయంగా వచ్చి స్వీకరించాలి. నా విజ్ఞప్తిని అందరూ అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను’ అని నిర్మాత, తెలంగాణ చలనచిత్ర అభివృద్ధి సంస్థ (టీజీఎఫ్‌డీసీ) చైర్మన్‌ దిల్‌ రాజు అన్నారు. శనివారం నిర్వహించిన తెలంగాణ గద్దర్‌ అవార్డుల వేడుక విజయవంతమైన సందర్భంగా ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దిల్‌రాజు మాట్లాడుతూ ‘షూటింగ్స్‌ ఉన్నా పక్కనపెట్టి పురస్కార గ్రహీతలు స్వయంగా అవార్డ్‌ ప్రధానోత్సవ కార్యక్రమానికి హాజరవ్వాలి. అది మన బాధ్యత. త్వరలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కూడా సినీ పురస్కారాలను ఇవ్వబోతోంది. అందరికీ చెబుతున్నా... గుర్తు పెట్టుకోండి. ప్రభుత్వంతో సామరస్యపూర్వకంగా ముందుకెళ్లాల్సిన బాధ్యత ఇండస్ట్రీలోని ప్రతి ఒక్కరిపైన ఉంది’ అని చెప్పారు. ‘గద్దర్‌ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమాన్ని భారీ స్థాయిలో నిర్వహించి విజయవంతం చేశాం. ఆరునెలల నుంచి పడిన కష్టం ఫలించినందుకు చాలా ఆనందంగా ఉంది. సినీ పరిశ్రమలోని వారంతా ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమాన్ని నిర్వహించిన తీరు బావుందంటూ చాలామంది ప్రశంసిస్తున్నారు.


సీఎం గారు గంట సమయం ఇస్తానన్నారు. కానీ నా కోరిక మేరకు ఆయన రెండు గంటలకుపైగా ఉండడం ఉత్సాహాన్నిచ్చింది. ఇంత పెద్ద వేడుకలో ఏవైనా పొరపాట్లు జరిగి ఎవరి మనసైనా నొప్పించి ఉంటే వాళ్లకు టీజీఎఫ్‌డీసీ తరపున క్షమాపణలు చెబుతున్నాను’ అని దిల్‌రాజు అన్నారు. ఈ కార్యక్రమంలో టీజీఎఫ్‌డీసీ ఎండీ హరీశ్‌ పాల్గొన్నారు.

Updated Date - Jun 16 , 2025 | 04:41 AM