Chiranjeevi: 45 యేళ్ళ పున్నమినాగు...
ABN , Publish Date - Jun 13 , 2025 | 08:27 PM
చిరంజీవి కెరీర్ ప్రారంభంలో ప్రతినాయకుడి ఛాయలున్న పాత్రలు కొన్ని చేశారు. అందులో ప్రధానంగా చెప్పుకోదగ్గది 'పున్నమి నాగు' సినిమా! ఆ చిత్రం విడుదలై నేటికి 45 సంవత్సరాలైంది.
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నటజీవితంలో అనేక ఘనవిజయాలు ఉన్నాయి. అయితే నటునిగా ఆయనకు మరపురాని చిత్రం అని చెప్పుకోదగ్గది ఒక్కటీ లేదని ఆ మధ్య ఆయన ముందే ఓ నటుడు అన్నారు. చిరంజీవికి నటునిగా మరపురాని సినిమాగా 'సైరా...నరసింహారెడ్డి' నిలవాలనీ ఆ నటుడు ఆశించారు. ఇక్కడే అందరూ తప్పులో కాలేస్తూ ఉంటారు. చిరంజీవి నటజీవితం ఆరంభంలోనే నెగటివ్ షేడ్స్ ఉన్న రోల్స్ లోనూ మెప్పించారు. అవి విలన్ వేషాలు అనుకున్నా, అదీ నటనే కదా! సరే అభిమానులు వాటిని ఇష్టపడకపోవచ్చు. కానీ, చిరంజీవిలోని అసలైన నటుణ్ణి జనం ముందు నిలిపిన తొలి చిత్రంగా 'పున్నమి నాగు' (Punnami Naagu)ను చెప్పుకోవచ్చు. 1980 జూన్ 13న విడుదలైన 'పున్నమి నాగు' చిత్రంలో చిరంజీవి విలక్షణమైన పాత్రలో నటించారు. అప్పటి దాకా తెలుగు చిత్రసీమలో ఆ తరహా పాత్రను ఎవరూ పోషించలేదు. మనిషికి పాము లక్షణాలు వస్తే ఎలా అన్నఅంశంతో 'పున్నమి నాగు' రూపొందింది. ఈ చిత్రానికి 1973లో రూపొందిన ఆంగ్ల చిత్రం 'స్స్....' (Sssssss) స్ఫూర్తి. దీనిని ఆధారం చేసుకొని మన భారతీయ విశ్వాసాలకు అనువుగా దర్శకుడు రాజశేఖర్ (Rajasekhar) కథను తయారు చేసుకున్నారు. ఈ రాజశేఖర్ అసలు పేరు సుబ్రహ్మణ్యం. రామ్ నారాయణన్ వద్ద అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేశారు. సుబ్రహ్మణ్యం పేరును రాజశేఖర్ గా మార్చింది రజనీకాంత్ (Rajnikanth). తమిళుడైన రాజశేఖర్ తన తొలిచిత్రంగా పాముకథతో కన్నడలో 'హుణ్ణిమెయ రాత్రియల్లి' (Hunnimeya Ratriyalli)సినిమాను తెరకెక్కించారు. లోకేశ్ హీరోగా రూపొందిన ఈ చిత్రం కన్నడనాట మంచి విజయం సాధించింది. దీనినే తెలుగులో ఏవీయమ్ (AVM) సంస్థ అదే రాజశేఖర్ డైరెక్షన్ లో 'పున్నమి నాగు'గా నిర్మించింది.
పాములు పట్టేవారికి పాము చేతిలోనే చావు ఉంటుందని నమ్మిన ఓ పాముల దాసరి- తన కొడుకు నాగులు పాము చేతిలో చావకూడదని ఆశిస్తాడు. చిన్నప్పటి నుంచే అతనికి పాము విషం పోసి పెంచుతాడు. పెద్దయ్యాక కొడుకును పాము ఏమీ చేయలేదని భావిస్తాడు. అయితే అదే నాగులుకు శాపమవుతుంది. పున్నమి వస్తే చాలు పాములాగా బుసలు కొడుతూంటాడు. అమ్మాయిలను తన వశం చేసుకొని వారిని అనుభవిస్తాడు. అతను కూడిన అమ్మాయిలు చనిపోతూ ఉంటారు. అలాగే తన ప్రేయసిని కూడా కోల్పోతాడు. చివరకు పాములాగా బతకాల్సి వస్తుందని భావిస్తాడు. ఆత్మహత్య చేసుకోవడంతో పున్నమినాగు ముగుస్తుంది. ఈ కథకు పలు హంగులు అద్ది రంజింప చేశారు రాజశేఖర్.
ఇందులో నరసింహరాజు (Narasimha Raju), రతి (Rati) ఓ జంటగా, చిరంజీవికి జోడీగా ఈ నాటి మేటి నటి కీర్తి సురేశ్ (Keerthi Suresh) తల్లి మేనక (Menaka) నటించారు. ఈ చిత్రానికి చక్రవర్తి సంగీతం ఓ ఎస్సెట్. వేటూరి సుందరరామమూర్తి రాసిన పాటలు భలేగా అలరించాయి. ముఖ్యంగా "పున్నమి రాత్రి..." అంటూ సాగే టైటిల్ సాంగ్ మురిపించింది. ఇక డ్యుయెట్స్ అన్నీ నరసింహరాజు, రతిపై చిత్రీకరించారు. జయమాలిని ఐటమ్ సాంగ్ కూడా ఆకట్టుకుంది. 45 ఏళ్ళ క్రితం 'పున్నమినాగు' చిత్రం మంచి విజయం సాధించింది. శతదినోత్సవం చూసింది. 'పున్నమి నాగు' సినిమా చూసిన వారందరూ నటునిగా చిరంజీవికి మార్కులు వేశారు. తనలోని పాము లక్షణాలు పోవాలని అతను గన్నేరు కాయలు తింటూ ఉంటాడు. పాములాగా పొరలు వస్తే, మందు పనిచేయదని శాస్త్రంలో ఉంటుంది. అతని ముఖంపై పొరలు వచ్చాయని తెలిసి, అద్దంలో చూసుకొని ఏడ్చే సీన్ లో చిరంజీవి నటన జనాన్ని కట్టిపడేసింది. నిజం చెప్పాలంటే ఈ విలక్షణమైన పాత్ర తరువాతే చిరంజీవిలోని నటునికి మంచి అవకాశాలు లభించాయని చెప్పవచ్చు. తరువాతి రోజుల్లో ఆయన మాస్ హీరోగా మసాలా సినిమాల్లో నటించడం వల్లే మళ్ళీ 'స్వయంకృషి, ఆపద్బాంధవుడు' దాకా చిరంజీవిలోని అసలైన నటుణ్ణి ఎవరూ ఉపయోగించుకోలేక పోయారని చెప్పవచ్చు.
చిరంజీవి స్టార్ హీరో అయిన తరువాత 'పున్నమి నాగు' నిర్మించిన ఏవీయమ్ సంస్థ ఆయనతో 'నాగు' (Naagu) అనే సినిమాను నిర్మించింది. ఈ చిత్రానికి షమ్మీ కపూర్ 'తీస్రీ మంజిల్' స్ఫూర్తి. అయితే 'పున్నమి నాగు' స్థాయిలో 'నాగు' అలరించలేక పోయింది. ఏది ఏమైనా చిరంజీవి నటజీవితంలో 'పున్నమినాగు' ఓ మరపురాని చిత్రం!
ఇక దర్శకుడు రాజశేఖర్ తరువాత 'పున్నమి నాగు' కథతోనే హిందీలో 'జీనే కీ ఆర్జూ' పేరుతో సినిమా రూపొందించారు. ఇందులో చిరంజీవి పాత్రను మిథున్ చక్రవర్తి పోషించారు. ఆపై రాజశేఖర్ దాదాపు 20 తమిళ చిత్రాలు రూపొందించారు. ఆయన దర్శకత్వంలో మళ్ళీ 1989లో 'బామ్మమాట బంగారు బాట' (Bamma Maata Bangaru Baata)అనే తెలుగు సినిమా తెరకెక్కింది. ఈ చిత్రాన్ని కూడా ఏవీయమ్ సంస్థ నిర్మించడం విశేషం!
Also Read: Thug Life: కర్ణాటక ప్రభుత్వానికి సుప్రీమ్ కోర్ట్ నోటీసులు
Also Read: Gedela Raju: రఘుకుంచె : గేదెల రాజు.. కాకినాడ తాలుకా
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి