Tollywood Heroes:  విమాన ప్రమాదం... స్పందించిన బాలకృష్ణ - చిరంజీవి 

ABN , Publish Date - Jun 12 , 2025 | 06:31 PM

టాలీవుడ్ సీనియర్ హీరోలు నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna), చిరంజీవి(Chiranjeevi) సైతం ఈ ఘటనపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.

Tollywood

Tollywood Heroes:  అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై సినీ తారలు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్న విషయం తెల్సిందే. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, కన్నడ, మలయాళం అనే తేడా లేకుండా స్టార్స్ అందరూ ఈ ఘటనపై స్పందిస్తున్నారు.  తాజాగా  టాలీవుడ్ సీనియర్ హీరోలు నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna), చిరంజీవి(Chiranjeevi) సైతం ఈ ఘటనపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా వారు ఈ ప్రమాదంలో మరణించినవారికి సంతాపం తెలిపారు. 

 

" గుజరాత్‌లో జరిగిన విమాన ప్రమాదం నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ దుర్ఘటన మాటలకందని విషాదాన్ని నింపింది.ప్రయాణికులతో పాటు సిబ్బంది... అలాగే విమానం కూలిన ప్రదేశంలో ఉన్న మరికొంతమంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోవడం హృదయాన్ని తీవ్రంగా కలచివేస్తోంది. ఈ ప్రమాదంలో మన భారతీయులతో పాటు విదేశీయులూ ప్రాణాలు కోల్పోవడం మరింత బాధాకరం. ఈ జాతీయ విపత్తు సమయంలో దేశం మొత్తం ఒక్కటై బాధిత కుటుంబాలకు మానసిక బలం అందించాలి. బాధితులకు అండగా నిలిచేందుకు ప్రతి ఒక్కరూ కేంద్ర ప్రభుత్వానికి సంపూర్ణ సహకారం అందించాలి. ఈ సంఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి, సంతాపం తెలుపుతున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. ఈ వంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను" బాలకృష్ణ తెలిపాడు. 

 

Plane Crash: విమాన ప్రమాదంపై ప్రముఖుల సంతాపం! 


ఇక చిరంజీవి కూడా ట్విట్టర్ వేదికగా ఈ ఘటనపై స్పందించాడు. " అహ్మదాబాద్ నుండి లండన్ వెళ్తున్న Al171 విమానం లో జరిగిన భయంకరమైన విషాదం గురించి విని చాలా బాధపడ్డాను. ఇది ఎంత హృదయ విదారకమో చెప్పడానికి మాటలు సరిపోవు. మరణించిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి మరియు ప్రార్థనలు. వారి ఆత్మలకు శాంతి చేకూరాలి" అని తెలిపాడు. ప్రస్తుతం ఈ పోస్టులు నెట్టింట వైరల్ గా మారాయి. 

Updated Date - Jun 12 , 2025 | 06:31 PM