Actress Nayanthara: నయనతార డాక్యుమెంటరీపై మరో కేసు
ABN, Publish Date - Jul 08 , 2025 | 04:10 AM
సినీ నటి నయనతార డాక్యుమెంటరీకి వ్యతిరేకంగా హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది...
చెన్నై (ఆంధ్రజ్యోతి): సినీ నటి నయనతార డాక్యుమెంటరీకి వ్యతిరేకంగా హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. విఘ్నేష్ శివన్-నయనతారల వివాహ డాక్యుమెంటరీ గత ఏడాది నవంబరులో ‘నెట్ఫ్లిక్స్’లో విడుదలైన విషయం తెలిసిందే. తొలుత ఈ డాక్యుమెంటరీ ట్రైలర్ విడుదల సమయంలో, అందులో ‘నానుం రౌడీ దాన్’ చిత్రంలోని మూడు నిమిషాల షూటింగ్ ఫుటేజీ ఉంది. ఈ వ్యవహారంపై నటుడు ధను్షకు చెందిన వండర్ బార్స్ సంస్థ రూ.10 కోట్ల నష్టపరిహారం కోరుతూ కేసు వేసింది. ఈ కేసు హైకోర్టు విచారణలో ఉంది. తాజాగా డాక్యుమెంటరీకి వ్యతిరేకంగా మద్రాసు హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. ‘చంద్రముఖి’ చిత్రంలోని కొన్ని దృశ్యాలు డాక్యుమెంటరీలో అనుమతి లేకుండా వినియోగించారని, అందుకు రూ.5 కోట్లు నష్టపరిహారం చెల్లించాలంటూ కాపీ రైట్స్ కలిగిన ఏబీ ఇంటర్నేషనల్ పిటిషన్ దాఖలుచేసింది. ఈ పిటిషన్పై సోమవారం విచారణ చేపట్టిన హైకోర్టు..రెండు వారాల్లోగా వివరణ ఇవ్వాలని డాక్యుమెంటరీ రూపొందించిన డార్క్ స్టూడియో, నెట్ఫ్లిక్స్ సంస్థలను ఆదేశించింది.