Allu Arjun Praises: తెలుగువారంటే వైల్డ్ ఫైర్
ABN, Publish Date - Jul 07 , 2025 | 03:09 AM
అమెరికాలో టాలీవుడ్ సినీ తారలు సందడి చేశారు. ‘నార్త్ అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్)- 2025’ వేడుకలో దర్శకులు రాఘవేంద్రరావు, సుకుమార్, హీరో అల్లు అర్జున్, హీరోయిన్ శ్రీలీల తదితరులు...
అమెరికాలో టాలీవుడ్ సినీ తారలు సందడి చేశారు. ‘నార్త్ అమెరికా తెలుగు సొసైటీ (నాట్స్)- 2025’ వేడుకలో దర్శకులు రాఘవేంద్రరావు, సుకుమార్, హీరో అల్లు అర్జున్, హీరోయిన్ శ్రీలీల తదితరులు పాల్గొన్నారు.
తెలుగువారంటే ఫైర్ అనుకున్నారా... వైల్డ్ ఫైర్ అంటూ తన ‘పుష్ప’ చిత్రంలోని డైలాగ్తో ప్రసంగాన్ని ప్రారంభించిన అల్లు అర్జున్ సభికులను అలరించారు. ‘ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఎంతో సంతోషిస్తున్నా. ఇంతమంది తెలుగువారిని చూస్తుంటే హైదరాబాద్లోనో విశాఖపట్నంలోనో ఉన్నట్లు అనిపిస్తోంది. అమెరికాలో మనమంతా ఇలా కలవడం అదృష్టంగా భావిస్తున్నా. నన్ను ఇలాంటి అద్భుతమైన కార్యక్రమానికి ఆహ్వానించినందుకు నాట్స్కు ధన్యవాదాలు. నాట్స్ గురించి సరదాగా ‘పుష్ప’ స్టయిల్లో చెప్పాలంటే ‘నాట్స్ అంటే నేషనల్ అనుకుంటివా... ఇంటర్నేషనల్’. మన తెలుగు సంస్కృతిని ముందు తరాలకు చేరవేస్తున్నందుకు ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. భారతీయులు ఎక్కడున్నా తగ్గేదేలే...అందులోనూ తెలుగోళ్లు అస్సలు తగ్గేదేలే. విదేశాల్లోనూ తెలుగువారు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు’ అని అల్లు అర్జున్ అన్నారు.
దర్శకుడు రాఘవేంద్రరావు మాట్లాడుతూ ‘నేను పరిచయం చేసిన బన్నీ, శ్రీలీల ఇక్కడ ఉన్నందుకు ఆనందంగా ఉంది. సుకుమార్కూ నాకూ ఒక పోలిక ఉంది. అదే గడ్డం. నేను ‘అడవి రాముడు’లో అడవిని నమ్ముకున్నా. స్టార్ డైరెక్టర్ను అయ్యా. ‘పుష్ప’లో అడవిని నమ్ముకున్న సుకుమార్ స్టార్ డైరెక్టర్ అయ్యారు. బన్నీని స్టార్ హీరోను చేశారు. శ్రీలీల సైతం దెబ్బలు పడతాయని అంటూ అందరినీ అలరిస్తోంది’ అని అన్నారు.