Akhanda2: నాకు జరిగిన.. అత్యంత మంచి విషయం ఇదే! అఖండ2 నిర్మాత.. లేటెస్ట్ పోస్ట్ వైరల్
ABN, Publish Date - Dec 07 , 2025 | 07:00 AM
ఆకాశాన్నంటే అంచనాలతో, ప్రపంచమంతా ఎంతో ఆత్రుతతో ఎదురు చూసిన చిత్రం బాలకృష్ణ ఆఖండ 2 తాండవం వాయిదా పడిన విషయం తెలిసిందే.
ఇటీవల ఆకాశాన్నంటే అంచనాలతో, ప్రపంచమంతా ఎంతో ఆత్రుతతో ఎదురు చూసిన చిత్రం బాలకృష్ణ (Nandamuri Balakrishna) ఆఖండ 2 తాండవం (Akhanda 2 Thaandavam). మరో గంటలో రిలీజ్ అవుతుందనుకున్నది కాస్త ప్రీమియర్స్ వాయిదా పడడం, ఆపై మొత్తానికి సినిమా రిలీజే పోస్ట్ఫోన్ కావడం ఒకదాని తర్వాత మరోటి చకచకా జరిగిపోయి అందరినీ షాక్ గురి చేసిన విషయం తెలిసిందే.
దీంతో రెండు రాష్ట్రాల వ్యాప్తంగా మేకర్స్ తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఎదురయింది. అంతా తిట్టిన వారే తప్పా అయ్యో పాపం అన్న వాళ్లు ఒక్కరూ లేరు. ఇక నందమూరి ఫ్యాన్స్ అయితే తీవ్ర నిరాశలోకి వెళ్లిపోయారు. వారికి శోకం ఒక్కటే తక్కువైంది. కొన్ని చోట్ల అది కూడా జరిగిపోయింది. దీంతో మేకర్స్ పేరు చెబితేనే ఫ్యాన్స్ అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. కనిపిస్తే వారి నోటికి కాకుండా చేతులకు పని చెప్పేలా పరిస్థితి తయారైంది.
అయితే తాజాగా ఈ సినిమా ఫైన్సాన్ సమస్యలు ఓ కొలిక్కి వచ్చాయని ఎటుబడి ఈ నెలలోనే సినిమా రిలీజ్ చేయాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. అయితే డిసెంబర్ 12 లేదా 25 తేదీలలోఏదైనా ఓ రోజున సినిమాను విడుదల చేయనున్నారు. ఇదిలాఉంటే.. తాజాగా ఈ సినిమా నిర్మాత రామ్ అచంట చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ పోస్టుపై ఫ్యాన్స్ ఓవైపు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా మరోవైపు ఇదిరా మా బాలయ్య బాబు అంటూ ఆయన గొప్పతనాన్ని సగర్వంగా చెప్పుకుంటున్నారు.
అఖండ 2 నిర్మాతలలో ఒకరైన రామ్ అచంట (Raam Achanta) జన్మదినం శనివారం జరిగింది. ఈ సందర్భంగా బాలకృష్ణ స్వయంగా ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ విషయాన్ని నిర్మాత సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ భావోద్వేగం చెందారు. 'ఇరోజు నాకు జరిగిన అత్యంత మంచి విషయం ఏమిటంటే.. మాబాలకృష్ణ గారు స్వయంగా నా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడం. ఈ కష్టకాలంలో ఆయన ఇచ్చిన ఆత్మవిశ్వాసం, మనోధైర్యానికి హద్దుల్లేవు. ఈ సందర్భంలో నాకు మద్దతుగా నిలిచినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు సర్. నిలువెళ్లా మంచితనంతో నిండిన హృదయం ఉన్న వ్యక్తి మీరు.. జై బాలయ్య' అంటూ కృతజ్ఞతలు తెలుపుతూ ప్రశంసల వర్షం కురిపించారు. ఆపై అతి త్వరలోనే అఖండ2 మీ ముందుకి వస్తుందని ప్రకటించారు. ఈ పోస్టుపై సామాజిక మాధ్యమాల్లో మిశ్రమ స్పందనలు వస్తున్నాయి.