SS Rajamouli: 'వారణాసి లీక్స్'.. రాజమౌళి నెక్ట్స్ సినిమా కన్ఫర్మ్?
ABN, Publish Date - Dec 08 , 2025 | 07:23 AM
ఇండియన్ సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటిన విజనరీ ఎస్.ఎస్. రాజమౌళి. కేవలం ఒక దర్శకుడు కాదు, తెలుగు సినిమా స్థాయిని అంతర్జాతీయ శిఖరాలకు చేర్చిన అసమాన సృష్టికర్త.
ఇండియన్ సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటిన విజనరీ ఎస్.ఎస్. రాజమౌళి (SS Rajamouli). కేవలం ఒక దర్శకుడు కాదు, తెలుగు సినిమా స్థాయిని అంతర్జాతీయ శిఖరాలకు చేర్చిన అసమాన సృష్టికర్త. భారీ బడ్జెట్, అద్భుతమైన విజువల్స్, భావోద్వేగాలను పట్టి ఉంచే కథనంతో.. ఆయన ప్రతి చిత్రం ఒక దృశ్యకావ్యం!. బాహుబలి సిరీస్తో భారతీయ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసి, RRR చిత్రంతో ఆస్కార్ వేదికపై తెలుగు జెండాను రెపరెపలాడించి జక్కన్న ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) తో తెరకెక్కిస్తున్న పాన్ వరల్డ్ చిత్రం 'వారణాసి (Varanasi) .
ఇటీవల భారీ అంచనాల మధ్య విడుదలైన 'వారణాసి' టైటిల్ గ్లింప్స్ ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. ఈ స్పెషల్ యాక్షన్ విజువల్స్కి ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన స్పందన లభిస్తోంది. ముఖ్యంగా, నందీశ్వరుడి కాన్సెప్ట్ చుట్టూ అల్లబడిన ఈ యాక్షన్ దృశ్యాలు మహేష్ బాబును సరికొత్త, అద్భుతమైన కోణంలో చూపించాయని అభిమానులు, విశ్లేషకులు ప్రశంసిస్తున్నారు. ప్రతి ఫ్రేమ్లో రాజమౌళి మార్క్ కనిపిస్తూ, ఈ సినిమా స్థాయిని తెలియజేస్తోంది. షూటింగ్ దశలోనే ఈ పాన్-వరల్డ్ మూవీపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి.
ఇదిలా ఉండగా.. 'వారణాసి' ఈవెంట్లో రాజమౌళి ఒక సంచలన విషయాన్ని బయటపెట్టారు. ఈ సినిమాలో రామాయణ ఘట్టం ఆధారంగా ఒక ప్రత్యేకమైన ఎపిసోడ్ను రూపొందించామని ఆయన వెల్లడించారు. ఈ ఎపిసోడ్లో మహేష్ బాబు శ్రీరాముడి పాత్రలో కనిపించబోతున్నారనే ప్రకటన అభిమానుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది. మహేష్ను శ్రీరాముడి రూపంలో చూడబోతున్నామన్న వార్తతో ఆ పాత్ర లుక్పై అమాంతం ఆసక్తి పెరిగింది. థియేటర్లలో ఈ ప్రత్యేక ఎపిసోడ్కు భారీ స్పందన వస్తుందనే నమ్మకాన్ని దర్శకుధీరుడు వ్యక్తం చేశారు.
ఇక 'వారణాసి' ప్రాజెక్ట్ షూటింగ్లో ఉండగానే, రాజమౌళి తదుపరి చిత్రం ఏమిటనే ఊహాగానాలు ప్రపంచవ్యాప్తంగా మొదలయ్యాయి. ఈ చర్చల్లో ఆయన చిరకాల డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన మహాభారతం (Mahabharat) మళ్ళీ తెరపైకి వచ్చింది. 'బాహుబలి-2' సమయంలోనే ఈ ప్రాజెక్ట్పై తనకున్న ఆలోచనను రాజమౌళి పంచుకున్నారు. అయితే, 'వారణాసి' ఈవెంట్లో ఆయన మళ్ళీ ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ను ప్రస్తావించడంతో, అభిమానుల్లో అంచనాలు పతాక స్థాయికి చేరాయి. నెట్టింట ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్గా మారింది.
'వారణాసి' పూర్తవగానే జక్కన్న తదుపరి మహాభారతం సినిమాను ప్రారంభించబోతున్నారన్న రూమర్స్ వైరల్ అవుతున్నాయి. ఈ అతిపెద్ద చారిత్రక కథను రాజమౌళి తనదైన శైలిలో, అద్భుతమైన విజువల్స్తో, అంతర్జాతీయ స్థాయిలో ఎలా మలుస్తారో చూడాలని ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులు, రాజమౌళి అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.