Nadigar Sangam: రజనీ, కమల్ హాసన్లకు సన్మానం
ABN, Publish Date - Sep 19 , 2025 | 11:59 AM
దక్షిణ భారత నటీనటుల సంఘం (నడిగర్ సంఘం) 69వ సర్వసభ్య సమావేశం ఈ నెల 21వ తేదీ జరుగనుంది.
దక్షిణ భారత నటీనటుల సంఘం (నడిగర్ సంఘం) (Nadigar Sangam) 69వ సర్వసభ్య సమావేశం ఈ నెల 21వ తేదీ జరుగనుంది. తేనాంపేటలోని కామరాజర్ అరంగంలో జరిగే ఈ సమావేశానికి ఆ సంఘం అధ్యక్షుడు నాజర్ (Nasser), ప్రధాన కార్యదర్శి విశాల్ (Vishal), కోశాధికారి కార్తి, ఉపాధ్యక్షులు పూచ్చి మురుగన్, కరుణాస్, నడిగర్ సంఘ కార్యవర్గం, సర్వసభ్య సభ్యుల సహా 3 వేల మంది హాజరు కానున్నారు. ఉదయం 8.30 గంటలకు కార్యవర్గ సమావేశం, ఆ తర్వాత సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించనున్నారు.
ఇందులో నడిగర్ సంఘ నూతన భవన ప్రారంభోత్సవం, సంఘం ఎన్నికల నిర్వహణ తదితర అంశాలపై చర్చించన్నారు. ప్రధానంగా నడిగర్ సంఘానికి ప్రతి మూడేళ్ళకు ఒకసారి ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అయితే 2019లో జరిగిన ఎన్నికల ఫలితాలను న్యాయపరమైన చిక్కుల కారణంగా 2022లో వెల్లడించారు. ఈ ఎన్నికల్లో అధ్యక్షుడిగా నాజర్, ప్రధాన కార్యదర్శిగా విశాల్, కోశాధికారిగా కార్తి (Karthi )లతో పాటు వారి బృందం ఎంపికయ్యారు. ఈ కమిటీ కాలపరిమితి గత మార్చితో ముగిసిపోయింది.
అయితే, నడిగర్ సంఘం భవన నిర్మాణం పూర్తయ్యేంత వరకు ప్రస్తుత కార్యవర్గమే తదుపరి మూడేళ్ళు కొనసాగేలా గత సర్వసభ్య సమావేశంలో ఒక తీర్మానం చేసి ఆమోదించగా, దీన్ని వ్యతిరేకిస్తూ కొందరు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు ఎన్నికలు నిర్వహించేందుకు వచ్చిన సమస్యలేంటో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ, తదుపరి విచారణను వచ్చే నెల 15వ తేదీకి వాయిదా వేసింది.
మరోవైపు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి 50 యేళ్ళు పూర్తి చేసుకున్న రజనీకాంత్ (Rajinikanth)కు, రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన కమల్ హాసన్ (Kamal Haasan)ను సన్మానించేలా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించాలని నడిగర్ సంఘం భావిస్తోంది. దీనిపై కూడా చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.