Kerala Committee: హేమ కమిటీ నివేదిక.. 35 కేసులు క్లోజ్
ABN, Publish Date - Jun 26 , 2025 | 05:14 PM
మలయాళ ఇండస్ట్రీలో జరుగుతున్న అరాచకాలు, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు కమిటీ బహిర్గతం చేసింది. ఈ రిపోర్ట్ ఆధారంగా నమోదైన 35 కేసులను దర్యాప్తు చేసేందుకు సిట్ను కూడా ఏర్పాటు చేశారు
మలయాళ చిత్ర పరిశ్రమలో (mollywood) మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు. ఇతర సమస్యలు తెలుసుకోవడం కోసం అక్కడి ప్రభుత్వం జస్టిస్ హేమ కమిటీని (Kerala Committee) ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అసలు మలయాళ పరిశ్రమలో ఏం జరుగుతుందో తెలుసుకున్న హేమ కమిటీ ఓ నివేదికను తయారు చేసింది. ఇండస్ట్రీలో జరుగుతున్న అరాచకాలు, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు కమిటీ బహిర్గతం చేసింది. ఈ రిపోర్ట్ ఆధారంగా నమోదైన 35 కేసులను (35 Casses Closed) దర్యాప్తు చేసేందుకు సిట్ను కూడా ఏర్పాటు చేశారు. ఆ కేసులన్నీంటిని మూసి వేస్తున్నట్లు సిట్ తాజాగా కేరళ హైకోర్టుకు తెలిపింది. ఆయా కేసులకు సంబంధించి వాంగ్మూలం ఇచ్చేందుకు బాధితులు ముందుకు రావడం లేదని.. అందుకే వాటిని మూసివేస్తున్నామని న్యాయస్థానానికి తెలియజేసింది. సిట్ నివేదికపై దర్యాప్తు జరిపిన న్యాయస్థానం.. ప్రస్తుతానికి ఎలాంటి చర్యలు తీసుకోవద్దని.. ఆ కేసులు మూసివేయాలని ఆదేశించింది.
అసలు విషయంలోకి వెళ్తే.. 2017లో కొచ్చిలో ఓ మలయాళ నటి కిడ్నాప్ కేసు సంచలనం సృష్టించింది. రౌడీలతో ఆమెపై లైంగిక వేధింపులు జరిపినట్లు నటుడు దిలీప్పై ఆరోపణలు వచ్చాయి. ఆ కేసులో అతన్ని అరెస్ట్ చేశారు. ఆ కేసు తర్వాత మలయాళ చిత్ర పరిశ్రమలోని మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, సమస్యలపై అధ్యాయనం చేయడానికి కేరళ ప్రభుత్వం 2019లో జస్టిస్ హేమ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది. ఇటీవల ఈ కమిటీ మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళల పరిస్థితి తెలుసుకుంది. తీవ్ర దిగ్ర్భాంతి కర విషయాలను నివేదికలో పేర్కొంది. సినీ పరిశ్రమలో మహిళల సమస్యలు, వర్కింగ్ కండీషన్లు, రెమ్యూనరేషన్, సాంకేతికరంగంలో మహిళల భాగస్వామ్యం మొదలగు విషయాలపై అధ్యయనం చేసిన కమిటీ మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నివేదికలో పేర్కొంది. సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం 235 పేజీల నివేదికను కేరళ ప్రభుత్వానికి సమర్పించింది. ఈ నివేదిక బయటకు వచ్చిన తర్వాత పలువురు నటీమణులు తాము ఎదుర్కొన్న వేధింపులను బయటకు వెల్లడించాలి. ఈ ఆరోపణలు కేరళలో సంచనలం సృష్టించాయి. దాంతో కేరళ చిత్రసీమకు చెందిన అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్లకు మోహన్లాల్తో సహా ఇతర సభ్యులు రాజీనామా చేశారు.