Ilaiyaraja-Yuvan: తండ్రీకొడుకుల అద్భుత సంగీత కలయిక
ABN , Publish Date - Nov 20 , 2025 | 01:31 PM
తండ్రీకొడుకులు కలసి నటిస్తే అభిమానులు మురిసిపోతారు. కొడుకు నిర్మాణంలో తండ్రి సినిమా చేసినా, తండ్రి డైరెక్ట్ చేసిన సినిమాలో కొడుకు నటించినా క్రేజీ ప్రాజెక్టులుగా మారిపోతాయి. అలాంటి ఛాన్స్ సంగీత దర్శకులకు వస్తే.. అది కూడా లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ అయితే... వినడానికే ఎగ్జయింటింగ్ గా ఉంది కదా.. మరి ఆ ఛాన్స్ కొట్టేసిన ఆ తండ్రీకొడుకులు ఎవరు.
భారతీయ సినీ సంగీత రంగంలో ఇళయరాజా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దక్షిణ భారత భాషలన్నింటా వేలాది పాటలకు స్వరాలు సమకూర్చి, దశాబ్దాలుగా శ్రోతల గుండెల్లో నిలచిపోయిన మహా సంగీతకారుడు ఆయన. ఇప్పటికీ సీనియర్ మోస్ట్ కంపోజర్గా కొన్ని ప్రాజెక్టులు చేస్తూనే ఉన్నాడు. ఇక ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తూ కుమారుడు యువన్ శంకర్ రాజా కూడా తెలుగు, తమిళ్ సినిమాలకు సంగీతం అందిస్తూ బిజీగా ఉంటున్నాడు. అయితే ఇద్దరూ ఇప్పటి వరకు ఎప్పుడూ ఒకే పాటలో కలసి పాడలేదు. కానీ ఇప్పుడు ఆ అద్భుతం ఆవిష్కృతమైంది.
గతంలో ఇళయరాజా సంగీతం ఇచ్చిన కొన్ని సినిమాల్లో యువన్ గాత్రం వినిపించింది కానీ, యువన్ ట్యూన్కు ఇళయరాజా గొంతు ఎప్పుడూ రాలేదు. కానీ ఆ అద్భుత ఘట్టం తాజాగా జరిగింది. తమిళ చిత్రం ‘కొంబుసివీ’లో “అమ్మా ఎన్ తంగక్కని నీతానే ఎల్లాం” అనే అదిరిపోయే ఎమోషనల్ పాటను తండ్రీకొడుకులిద్దరూ కలసి ఆలపించారు. ఈ పాటకు సంగీతం కూడా యువన్ శంకర్ రాజానే అందించడం విశేషం.
లిరిసిస్ట్ విజయ్ రాసిన ఈ పాట సినిమాకు హైలైట్గా నిలవనుందని అంచనా. పొన్రామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో శరత్ కుమార్, విజయకాంత్ కుమారుడు షణ్ముగపాండియన్ కీ రోల్స్ చేస్తున్నారు. హీరోయిన్గా తర్నిక నటిస్తోంది. కామెడీ-యాక్షన్ నేపథ్యంలో సాగే కథ థేని, ఉసిలంపట్టి ప్రాంతాల్లో షూటింగ్ జరుగుతోంది. భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమా డిసెంబర్లో రిలీజ్ కాబోతోంది. యువన్ ట్యూన్కు ఇళయరాజా గొంతు… ఆ కలయిక ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి సంగీత అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
Read Also: Pooja Hegde: పూజా.. లక్ మారదా! ధనుష్కు జోడీగా మరోసారి సాయి పల్లవి?
Read Also: Prathysha Case: నటి ప్రత్యూష మృతి కేసు... తీర్పు రిజర్వ్ చేసిన సుప్రీమ్ కోర్ట్