Janaki vs State of Kerala: ఆ పాత్రకు సీత పేరు పెట్టలేం.. సెన్సార్ సూచన
ABN, Publish Date - Jun 23 , 2025 | 01:03 PM
సురేశ్ గోపి, నటి అనుపమ పరమేశ్వరన్ కీలక పాత్రధారులుగా తెరకెక్కిన ‘జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ సినిమాకు సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ నిరాకరించడం ఇండస్ర్టీలో చర్చనీయాంశంగా మారింది.
కేంద్రమంత్రి, నటుడు సురేశ్ గోపి (Suresh gopi) , నటి అనుపమ పరమేశ్వరన్ (anupama parameswaran) కీలక పాత్రధారులుగా తెరకెక్కిన చిత్రం ‘జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ (Janaki vs State of Kerala) . జానకి అనే మహిళ చేేస న్యాయపోరాటం చుట్టూ తిరిగే థ్రిల్లర్ కథాంశంతో ప్రవీణ్ నారాయణ్ తెరకెక్కించారు. సత్యం ఎప్పటికైనా విజయం సాధిస్తుందనేది ఉప శీర్షిక. ఇందులో జానకిగా అనుపమ కనిపించనున్నారు. లాయర్గా సురేశ్ గోపి నటించారు. జూన్ 27న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ నిరాకరించడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.
సీతాదేవి మరో పేరైన జానకిని అలాంటి పాత్రకు పెట్టకోలేమని పేర్కొంటూ ఈ చిత్రం స్క్రీనింగ్ కు అనుమతి నిరాకరించినట్లు సినీ వర్గాలు ఓ సమావేశంలో తెలిపాయి. అలాగే ఈ సినిమా ప్రదర్శనకు సెన్సార్ బోర్డు అనుమతి నిరాకరించిందని దర్శకుడు చెప్పారు. ఇక ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ కేరళ ప్రధాన కార్యదర్శి, ప్రముఖ దర్శకుడు ఉన్ని కృష్ణన్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. సినిమాలో జానకి అనే పేరును ఉపయోగించరాదు. సెన్సార్ బోర్డు ఈ చిత్ర నిర్మాతలకు స్పష్టంగా తెలియజేసింది. టైటిల్, పాత్ర పేరును మార్చాలని బోర్డు చిత్రబృందానికి సూచించింది. దాడికి గురైన మహిళ పాత్రకు సీతాదేవి పేరును పెట్టలేమని బోర్డు చెప్పింది’’ అని అన్నారు. ఈ మధ్యనే మరో మలయాళ చిత్రానికి ఇలాంటి సమస్యే ఎదురు కాగా సెన్సార్ సర్టిఫికెట్ పొందడానికి ఆ పేరును ‘జయంతి’గా మార్చారని తెలిపారు.