Rashmika Mandanna: డబ్బులిచ్చి.. నాపై ట్రోల్స్ చేయిస్తున్నారు
ABN, Publish Date - Aug 12 , 2025 | 10:29 AM
వరుస విజయాలతో బాలీవుడ్, టాలీవుడ్లలో అగ్రభాగాన దూసుకుపోతోంది కన్నడ కస్తూరి, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా .
వరుస విజయాలతో బాలీవుడ్, టాలీవుడ్లలో అగ్రభాగాన దూసుకుపోతోంది కన్నడ కస్తూరి, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా (Rashmika Mandanna). సినిమాల్లోకి వచ్చి త్వరలోనే దశాబ్దం పూర్తి చేసుకోబోతున్న ఈ ముద్దుగుమ్మ ఇతరులకు సాధ్యం కాని విధంగా అతి తక్కువ సమయంలోనే బాలీవుడ్లో జెండా పాతి ఆప్రతిహాతంగా దూసుకుపోతుంది. ఇప్పటికే యానిమల్ (Animal), పుష్ప2 (Pushpa), ఛావా (Chhaava), కుబేర (Kuberaa), వంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో గోల్డెన్ లెగ్ అనే పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం తెలుగులో రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్లో గర్ల్ ఫ్రెండ్ (The Girlfriend), హను రాఘవపూడి శిష్యుడితో మైసా, విజయ్ దేవరకొండతో ఒక చిత్రం మొత్తంగా మూడు పాన్ ఇండియా చిత్రాలతో పాటు బాలీవుడ్లో తమ (Thama ) అనే ఓ చిత్రంతో చాలా బిజీగా ఉంది. అంతేకాదు అల్లు అర్జున్, అట్లీ కాంబో సినిమాలోనూ నటిస్తోన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
అయితే.. వృత్తి జీవితంలో చేతి నిండా సినిమాలతో, ఒక దాని తర్వాత మరోటి అద్భుత విజయాలు సాధిస్తున్నప్పటికీ, వ్యక్తిగతంగా రష్మిక కొన్ని కఠిన పరిస్థితులను ఎదుర్కొంటోంది. సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్ తన మనసును దెబ్బతీస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఇటీవల ఓ బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రష్మిక మాట్లాడుతూ తన మనో వేదనను బయట పెట్టింది. “నేనూ అందరిలాగానే భావోద్వేగాలు కలిగిన అమ్మాయినే. కానీ వాటిని బయటకు చెప్పడానికి ఇష్టపడను. అలా చేస్తే, ‘కెమెరా కోసం చేస్తున్నారు’ అని అంటారు అని తెలిపింది. నా ఎదుగుదలను అడ్డుకునేందుకు, నా పేరు చెడగొట్టేందుకు కొందరు డబ్బులిచ్చి మరీ ట్రోల్ చేయిస్తున్నారు. వారు ఎందుకు ఇంత క్రూరంగా మారుతున్నారో అర్థం కావడం లేదు. నాపై ప్రేమ చూపించక పోయినా పర్వాలేదు, కావాలని వ్యతిరేకతను ప్రచారం చేయొద్దని కోరింది.
దీంతో ఇప్పుడు రష్మిక చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతుండడంతో. అభిమానులు, సినీ ప్రముఖులు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. అలాంటి ప్రచారాలను పట్టించుకోవద్దని, ఇవన్నీ నిత్యకృత్యమని, ఒకరు ఎదుగుతున్నారంటే ఇలాంటి సర్వ సాధారణమని అభిమానుల ఆదరణ ఉన్నంత వరకు ఎవరూ ఎవరినీ తగ్గించలేరని, ఆమెకు స్వాంతన ఇచ్చేలా మాట్లాడుతున్నారు. అయితే ఈ ట్రోలింగ్ తన కర్ణాటక నుంచి జరుగుతుందా లేక బాలీవుడ్, టాలీవుడ్ల నుంచి జరుగుతుందా అనేది తెలియాల్సి ఉంది.