Viraatapalem Thriller Series Review: విరాట పాలెం వెబ్ సీరిస్ రివ్యూ
ABN , Publish Date - Jun 27 , 2025 | 02:52 PM
జీ 5 ఓటీటీలో శుక్రవారం నుండి విరాట పాలెం: పీసీ మీనా రిపోర్టింగ్ వెబ్ సీరిస్ స్ట్రీమింగ్ అవుతోంది. సోషల్ మీడియాతో పాపులారిటీ పొందిన అభిజ్ఞ ఇందులో టైటిల్ రోల్ పోషించింది.
సోషల్ మీడియాతో పాపులారిటీ తెచ్చుకున్న అభిజ్ఞ వూతలూరు ప్రధాన పాత్ర పోషించిన వెబ్ సీరిస్ 'విరాట పాలెం: పీసీ మీనా రిపోర్టింగ్' (Viraatapalem: PC Meena Reporting). పోలూరు కృష్ణ దర్శకత్వంలో కె. వి. శ్రీరామ్ ఈ సీరిస్ ను నిర్మించారు. శుక్రవారం నుండి ఇది జీ 5 (ZEE5) లో స్ట్రీమింగ్ అవుతోంది.
ఇవాళ వెబ్ సీరిస్ లలో అత్యధిక భాగం ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్సే. ఒక హత్య జరిగినప్పుడు దాని పూర్వాపరాలను పరిశోధించడమే ప్రధానంగా మేకర్స్ కథలు రాసుకుంటున్నారు. ఇది కూడా ఆ కోవకు చెందే కథే. అయితే 1980లలో మొదలైన ఈ కథ 1990లలో జరుగుతోంది. విరాట పాలెం అనే గ్రామంలో నవ వధువులు పెళ్ళి అయిన మర్నాడే చనిపోతుంటారు. అది గ్రామానికి పట్టిన శాపంగా ఊరి జనం భావిస్తుంటారు. పదేళ్ళ కాలంలో ఏడు మంది అమ్మాయిలు చనిపోవడంతో ఆ వూరికి పిల్లని ఇవ్వడానికి కూడా ఎవరూ సాహసించరు. అలానే ఆ వూరి కుర్రాళ్ళు వేరే ఊరు వెళ్ళి అక్కడే స్థిరపడి పెళ్ళి చేసుకోవడం మొదలు పెడతారు. అలాంటి విరాట పాలెంలోకి కానిస్టేబుల్ గా వచ్చిన మీనా (అభిజ్ఞ వూతలూరు) ఈ హత్యల వెనుక మిస్టరీని ఎలా ఛేదించిందన్నదే ఈ వెబ్ సీరిస్ కథాంశం.
విరాట పాలెంలో వరుసగా నవ వధువుల హత్యలు జరిగినా... ఎవ్వరూ కంప్లైంట్ చేయరు. దాంతో పోలీసులు సైతం వీటిని పరిష్కరించాలని అనుకోరు. పలుకుబడి ఉన్న వ్యక్తులు దీనికి వెనుక ఉన్నారని కొందరు భావిస్తే, అది అమ్మవారి శాపమని మరి కొందరు నమ్ముతారు. ఊరి ప్రెసిడెంట్ ను మొదలు కొని మీనా అందరినీ అనుమానిస్తూ ఉంటుంది. అయితే సరైన ఆధారాలు లేకుండా ఆమె కొందరిని అరెస్ట్ చేయడం ఆక్షేపణీయం అవుతుంది. మీనా పరిశోధన రసకందాయంలో పడుతున్న సమయంలోనే ప్రెసిడెంట్ కొడుకుతో ఆమె పెళ్ళి జరగడం, ఆ తర్వాత వాళ్ళు విడిపోవడం అనేది ఊహకందని మలుపే. ఆపైన కూడా స్టోరీ రకరకాల ట్విస్ట్స్ అండ్ టర్న్స్ తీసుకుంటుంది. చివరకు ఎవరూ ఊహించిన దోషిని జనాల ముందుకు నిలబెడుతుంది. ఇదంత బాగానే ఉంది కానీ ఈ హత్యలకు దర్శకుడు చెప్పే రీజనే సమంజసంగా అనిపించదు. తనకు జరిగిన అన్యాయాన్ని సహించలేక నవ వధువులను హత్య చేయడం అనేది అంత సబబుగా లేదు. మానవత్వం ఉన్న ఎవరైనా ఇలాంటి పరిస్థితుల్లో తనకు జరిగిన అవమానం పగవారికి కూడా జరగకూడదని అనుకుంటారు. కానీ ఇందులో ఆ పాత్రకు బలవంతంగా క్రూరత్వాన్ని అంటగట్టారు. అలానే హీరోయిన్ కు ప్రెసిడెంట్ కొడుకు కు మధ్య జరిగే పెళ్ళి... తదనంతర పరిణామాలు పేలవంగా ఉన్నాయి.
నటీనటుల విషయానికి వస్తే మీనా పాత్రను అభిజ్ఞ (Abhgnya) సమర్థవంతంగానే పోషించింది. ఇతర ప్రధాన పాత్రలను చరణ్ లక్కరాజు (Charan Lakkaraju), లావణ్య సాహుకర (Lavanya Sahukara), దాసన్న, జయవాణి (Jayavani), సురభి ప్రభావతి (Surabhi Prabhavathi), రామరాజు (Ramaraju), గౌతంరాజు, సతీశ్ వంటి వారు చేశారు. దివ్య తేజస్వి పేరా ఈ సిరీస్కు కథను అందించగా, విక్రమ్ కుమార్ కండిమల్ల స్క్రీన్ప్లేని సమకూర్చారు. రోహిత్ కుమార్ నేపథ్య సంగీతం, మహేష్ కె స్వరూప్ సినిమాటోగ్రఫీ బాగానే ఉన్నాయి. లిమిటెడ్ బడ్జెట్ తో ఈ వెబ్ సీరిస్ ను కె. వి. శ్రీరామ్ నిర్మించారు. ఈ మధ్య కాలంలో మర్డర్ మిస్టరీ వెబ్ సీరిస్ ను కుటుంబ సభ్యుల సమక్షంలో చూసే పరిస్థితి ఉండటం లేదు. కానీ విరాట పాలెం అందుకు మినహాయింపు కాకపోతే ఈ కథ మీద, కథనం మీద మేకర్స్ మరింత కసరత్తు చేసి ఉండాల్సింది.
కొసమెరుపు:
ఈ వెబ్ సీరిస్ జీ 5లో స్ట్రీమింగ్ కావడానికి కొద్ది రోజుల ముందు ఈటీవీ విన్ ఓ మీడియా మీట్ ను ఏర్పాటు చేసింది. 'విరాట పాలెం' పేరును ప్రస్తావించకుండా తాము నిర్మించిన 'కానిస్టేబుల్ కనకం' వెబ్ సీరిస్ ను కాపీ కొట్టారని ఆరోపణ చేసింది. ఒరిజినల్ స్టోరీ తమదే కాబట్టి ఈ విషయంపై కోర్టును ఆశ్రయించామని, తమకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. మరి వారికి జరిగిన అన్యాయానికి ఎలాంటి పరిహారం లభిస్తుందో చూడాలి.
ట్యాగ్ లైన్: తేలిపోయిన సస్పెన్స్
రేటింగ్: 2.25/5