NTR: అరవై ఏళ్ళ ప్రమీలార్జునీయం

ABN , Publish Date - Jun 11 , 2025 | 06:31 PM

ఎన్టీఆర్ నటించిన 'ప్రమీలార్జునీయం' చిత్రం అరవై వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ సినిమాతోనే ప్రముఖ దర్శకుడు ఎం. మల్లికార్జున రావు వెండితెరకు పరిచయం అయ్యారు.

నటరత్న యన్టీఆర్ (NTR) అర్జునునిగా నటించిన అనేక చిత్రాలు తెలుగువారిని విశేషంగా అలరించాయి. యన్టీఆర్ అర్జున పాత్రలో తెరకెక్కిన 'ప్రమీలార్జునీయం' చిత్రం 1965 జూన్ 11న విడుదలయింది. ఈ చిత్రం ద్వారా 1934 నాటి 'లవకుశ'లో సీత పాత్ర ధరించి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న సీనియర్ శ్రీరంజని తనయుడు ఎమ్.మల్లికార్జున రావు (M. Mallikarjuna Rao) దర్శకునిగా పరిచయం అయ్యారు.

యన్టీఆర్ అనగానే శ్రీకృష్ణ పాత్రనే ముందుగా గుర్తుకు వస్తుంది. అయితే ఆయన రామాయణ, భారత, భాగవతాల్లో ఇతర పౌరాణిక పాత్రలు పోషించిన సమయంలో సదరు చిత్రాలలో కాంతారావు (Kanta Rao) శ్రీరామునిగా, శ్రీకృష్ణునిగా నటించారు. అదే తీరున ఇందులోనూ శ్రీకృష్ణ పాత్రలో కాంతారావు కనిపించారు. ఇక ప్రమీల పాత్రలో బి.సరోజాదేవి (B.Saroja Devi) నటించి ఆకట్టుకున్నారు.

నిజానికి వ్యాస 'మహాభారతం'లో కురుక్షేత్ర అనంతరం పాండవ అశ్వమేధయాగం సాగుతుంది. అందులో ఎక్కడా ప్రమీల పాత్ర కనిపించదు. అయితే పాండవుల అశ్వాన్ని స్త్రీ పాలిత రాజ్యంలో ప్రమీల పరివారం బంధించడం, ఆమెతో అర్జునుడు పోరాడటం అంటూ సాగే కథ తరువాత వెలువడిన 'జైమినీ భారతం'లో దర్శనమిస్తుంది. ఆ కథకు కొన్ని సినిమా హంగులు అద్ది 'ప్రమీలార్జునీయం' చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రాన్ని కందిమళ్ళ ఆది బాబు, కె.నాగుమణి నిర్మించారు. పెండ్యాల నాగేశ్వరరావు సంగీతం సమకూర్చారు.


ఇందులో ఘటోత్కచుని కుమారుడు ఘకు పాత్రలో రేలంగి, కర్ణుని తనయుడు వృషకేతుగా శోభన్ బాబు, నారదునిగా పద్మనాభం, ధర్మరాజుగా మిక్కిలినేని నటించారు. వాణిశ్రీ, చంద్రకళ, రాజశ్రీ, గిరిజ, ఋష్యేంద్రమణి, ఛాయాదేవి, సూర్యకళ, అత్తిలి లక్ష్మి ఇతర ముఖ్యపాత్రధారులు. పింగళి నాగేంద్రరావు పాటలు పలికించిన ఈ చిత్రంలోని "ఓహో మనోజ్ఞ సుందరి..." అంటూ సాగే పాట, "నిను చూసి చూడగనే..." అనే పల్లవితో మొదలయ్యే గీతం మాత్రమే అలరించాయి. 1965లో యన్టీఆర్ నటించిన 12 చిత్రాలు విడుదల కాగా, అందులో 8 సినిమాలు డైరెక్ట్ హండ్రెడ్ డేస్ చూశాయి.. మిగిలిన వాటిలో అబౌ ఏవరేజ్ అనిపించుకున్న చిత్రం 'ప్రమీలార్జునీయం'. రిపీట్ రన్స్ లో 'ప్రమీలార్జునీయం' ఆదరణ పొందింది.

'ప్రమీలార్జునీయం'తో దర్శకుడైన ఎమ్.మల్లికార్జునరావు తరువాతి రోజుల్లో కృష్ణ (Krishna) హీరోగా 'గూఢచారి 116' (Gudachari 116) తో విజయం సాధించారు. ఆ పై కృష్ణతోనే "ముహూర్త బలం, అందరికీ మొనగాడు, చెల్లెలి కోసం, కోడలు పిల్ల, బందిపోటు భీమన్న, రక్తసంబంధాలు మనుషులు చేసిన దొంగలు, దొంగల దోపిడి, రగిలే హృదయాలు, తండ్రీకొడుకుల ఛాలెంజ్" వంటి చిత్రాలు రూపొందించారు.

Also Read : Devi Sri: డీఎస్పీపై మళ్లీ విమర్శలు..

Also Read: NTR: 'వార్ 2' డబ్బింగ్ షురూ!

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - Jun 11 , 2025 | 06:33 PM