Shashtipoorthi : షష్టిపూర్తి సినిమా రివ్యూ
ABN , Publish Date - May 30 , 2025 | 06:02 PM
'లేడీస్ టైలర్' తర్వాత రాజేంద్ర ప్రసాద్, అర్చన మరోసారి జంటగా నటించిన చిత్రం 'షష్టిపూర్తి'. ఈ ఫ్యామిలీ డ్రామాను రూపేష్ నిర్మించడంతో పాటు హీరోగానూ నటించాడు. ఇళయరాజా స్వరాలు సమకూర్చిన ఈ చిత్రం శుక్రవారం జనం ముందుకొచ్చింది.
నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ (Rajendra Prasad), జాతీయ ఉత్తమ నటి అర్చన (Archana) జంటగా నటించిన 'లేడీస్ టైలర్' (Ladies Tailor) మూవీ విడుదలై దాదాపు 38 సంవత్సరాలైంది. మళ్ళీ ఇంత కాలానికి వారిద్దరూ కలిసి జంటగా నటించిన సినిమా 'షష్టిపూర్తి' (Shashtipoorthi). పవన్ ప్రభ (Pavan Prabha) దర్శకత్వంలో ఈ సినిమాను నిర్మించడమే కాకుండా ఇందులో హీరోగా నటించాడు రూపేష్ (Roopesh). అతని సరసన ఆకాంక్ష సింగ్ (Akanksha Singh) హీరోయిన్ గా నటించింది. ఈ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందో చూసేద్దాం.
దివాకరం (రాజేందప్రసాద్), భువన (అర్చన) ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. వాళ్ళ ఒక్కగానొక్క కొడుకు శ్రీరామ్ (రూపేష్) పబ్లిక్ ప్రాసిక్యూటర్. నిజాయితీగా ఉండమని చెప్పిన తల్లి మాటలను అనుసరించి అందరికీ దూరమౌతాడు. అతనిలోని నిజాయితీ, ముక్కుసూటితనం అతన్ని ఒంటరిని చేస్తాయి. ఆ సమయంలో అతనికి చేరువైన జానకి (ఆకాంక్ష సింగ్) అతన్ని ప్రేమ పేరుతో మార్చేస్తుంది. సమాజంలో బతికి బట్టకట్టాలంటే మారాలని చెబుతుంది. తల్లి మాటలతో జీవితంలో చేదు అనుభవాలు ఎదుర్కొన్న శ్రీరామ్.. జానకి ప్రేమ కారణంగా మారిపోతాడు. తండ్రి తరహాలో స్వార్థపరుడు అయిపోతాడు. దాంతో తిరిగి బెల్లం చుట్టూ ఈగల్లా అతని చుట్టూ అందరూ చేరతారు. మంచి వాడైన శ్రీరామ్ ను... జానకి ఎందుకలా మార్చేసింది? ఆమె అతని నుండి ఏం ఆశించింది? తల్లి మంచి మాటలను పెడచెవిన పెట్టిన శ్రీరామ్ కోల్పోయిందేమిటీ? నిజంగానే దివాకరం అంత చెడ్డవాడా? భువన అతన్ని అసలు సరిగా అర్థం చేసుకుందా? షష్టిపూర్తి చేసుకోవాల్సిన వయసులో ఆ దంపతులు ఎందుకు విడాకులు తీసుకోవాలని అనుకున్నారు? లాయర్ అయిన వారి కొడుకుగా శ్రీరామ్ ఏం చేశాడు? అనేది 'షష్టిపూర్తి' సినిమా కథ.
ఎలా ఉందంటే...
మంచి - చెడు, తప్పు - ఒప్పు అనేవి మనిషి దృష్టికోణం బట్టి మారిపోతుంటాయి. కొందరికి తప్పుగా కనిపించేది మరికొందరికి ఒప్పు కావచ్చు. ఒకరికి మంచి అనిపించింది, మరొకరికి చెడుగా అనిపించొచ్చు. అలాంటి దృక్కోణాల నేపథ్యంలో సాగేదే 'షష్టిపూర్తి' సినిమా. అవినీతి పరుడైన దివాకరం, నిజాయితీగా బతకాలనుకునే టీచర్ భువన, వారి మధ్య అటూ ఇటూ ఊగిసిలాడే వారి కొడుకు, తండ్రి చావుకు కారణమైన దివాకరం కుటుంబంపై కక్ష తీర్చుకోవాలని రగిలిపోయే హీరోయిన్... ఈ పాత్ర మధ్య డ్రామాకేమీ తక్కువ లేదు. అయితే... దాన్ని కన్వెన్సింగ్ గా తెరకెక్కించడంలో దర్శకుడు పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేకపోయాడు. దాంతో మనుషులు ఇంత త్వరగా తమ అభిప్రాయాలను మర్చేసుకుంటారా? చిటికె వేసినంత సులువుగా మారిపోతారా? అనిపిస్తుంది. భర్త మెంటాలిటీ తెలిసి కూడా ముప్పై యేళ్ళు కాపురం చేసిన తర్వాత అతనికి విడాకులు ఇవ్వాలనుకోవడం చిత్రంగా అనిపిస్తుంది. చివరిలో వచ్చే కోర్టు సీన్ సైతం పేలవంగానే ఉంది. నవతరాన్ని మెప్పించడం కోసం కొన్ని పోరాట సన్నివేశాలు, రొమాంటిక్ సాగ్ వంటివి పెట్టినా... అవేవీ పెద్దంతగా ఆకట్టుకోవు. ఇళయరాజా (Ilayaraja) బాణీలకు చైతన్య ప్రసాద్, రెహమాన్, కీరవాణి (Keeravani) రాసిన పాటలు అర్థవంతంగానే ఉన్నాయి. కొన్ని పాటల చిత్రీకరణ బాగుంది. ముఖ్యంగా క్లయిమాక్స్ లో వచ్చే షష్టిపూర్తి పాట చూడముచ్చటగా ఉంది.
నటీనటులు సాంకేతిక నిపుణులు
నటీనటుల విషయానికి వస్తే ఇది రాజేంద్ర ప్రసాద్ కు టైలర్ మేడ్ క్యారెక్టర్. అర్చన నటనకు వంక పెట్టడానికి ఏమీ లేదు. కాకపోతే ఫ్లాష్ బ్యాక్ లో వీరిద్దరినీ యువ జంటగా చూడాలంటేనే కాస్తంత ఇబ్బందిగా ఉంటుంది. నిర్మాత కూడా అయిన రూపేశ్ పాత్రలో చాలానే వేరియేషన్స్ ఉన్నాయి. వాటిని మాగ్జిమమ్ తెర మీద ప్రదర్శించడానికి కష్టపడ్డాడు. ఆకాంక్ష సింగ్ పాత్ర కూడా బాగానే ఉంది. కాస్తంత గ్యాప్ తర్వాత ఆమె తిరిగి ఈ సినిమాలో నటించింది. ఇతర ప్రధాన పాత్రలు పోషించిన ఆర్టిస్టులు చాలామందే ఉన్నారు. వారంతా పాత్రోచితంగా నటించారు. సాంకేతిక నిపుణుల పనితనం గొప్పగానే ఉంది. అయితే... రకరకాల మలుపులున్న ఈ కథను ఆసక్తికరంగా తెరకెక్కించలేకపోవడం ప్రధాన లోపం. కాకపోతే ఇప్పుడు వస్తున్న చిత్రాలతో పోల్చితే ఇది చాలా బెటర్ మూవీ. కానీ ప్రేక్షకులు ఈ తరహా సినిమాలను ఏమేరకు ఆదరిస్తారనేది సందేహమే!
రేటింగ్: 2.5/5
ట్యాగ్ లైన్: మెలో డ్రామా!
Also Read: Bhairavam Review: ముగ్గురు హీరోల 'భైరవం' ఎలా ఉందంటే...
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి