Bhairavam Review: ముగ్గురు హీరోల 'భైరవం' ఎలా ఉందంటే
ABN , Publish Date - May 30 , 2025 | 03:06 PM
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్ సరైన విజయం చూసి చాలా కాలమైంది. మంచు మనోజ్ నుంచి సినిమా వచ్చి చాలా కాలం అవుతోంది. ఈ ముగ్గురు కలిసి ఓ మల్టీస్టారర్ సినిమా చేశారు. అదే భైరవం. తమిళంలో విజయం సాధించిన గరుడన్ చిత్రానికిది రీమేక్. ఆ
సినిమా రివ్యూ: భైరవం
విడుదల తేది: 30-5-2025
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్ సరైన విజయం చూసి చాలా కాలమైంది. మంచు మనోజ్ నుంచి సినిమా వచ్చి సంవత్సరాలు దాటాయి. ఈ ముగ్గురు కలిసి ఓ మల్టీస్టారర్ లో నటించారు. అదే భైరవం. తమిళంలో విజయం సాధించిన గరుడన్ చిత్రానికి ఇది రీమేక్. ఆదితి శంకర్, దివ్యా పిళ్లై, ఆనంది నాయికలు. జయసుధ, సంపత్ రాజ్, అజయ్, రాజా రవీంద్ర, వెన్నెల కిశోర్ ఇతర ప్రధాన పాత్రధారులు. ‘నాంది’, ‘ఉగ్రం’ సినిమాల తర్వాత విజయ్ కనకమేడల దర్శకత్వం వహించి సినిమా ఇది. సత్యసాయి ఆర్ట్స్, కె.కె.రాధామోహన్తో కలసి పెన్ స్టూడియోస్ జయంతీలాల్గడా నిర్మించారు. పాటలు, ట్రైలర్స్తో ఆకట్టుకున్న ఈ చిత్రానికి హైప్ బాగా వచ్చింది. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూద్దాం.
కథ:
శ్రీను (బెల్లంకొండ శ్రీనివాస్) అనాధ, వరద(నారా రోహిత్) లారీ ట్రాన్స్పోర్ట్ అధిపతి, గజపతి వర్మ (మంచు మనోజ్) చితికిన జమీందారు. ఈ ముగ్గురు దేవీపురంలో నివశిస్తుంటారు. ఒకరంటే ఒకరికి ప్రాణం. ఆ గ్రామ దేవత వారాహీ అమ్మవారి గుడికి గజపతి వర్మ (మంచు మనోజ్) నాయనమ్మ నాగరత్నమ్మ (జయసుధ) ధర్మకర్త. ఆ దేవాలయానికి చెందిన భూములపై దేవాదాయ శాఖ మంత్రి (శరత్ లోహితస్య) కన్నేస్తాడు. నాగరత్నమ్మ ఉండగా అది జరగదని తెలిసి ఆమెను చంపిస్తారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలలో దేవాలయ ధర్మకర్తగా శీను నియమితమవుతాడు. గుడికి చెందిన 75 ఎకరాల భూమి దక్కించుకోవాలంటే వరద, గజపతి, వారికి నమ్మిన బంటుగా ఉన్న శ్రీనుని దాటుకుని వెళ్లాలి. ఆ భూమిని సొంతం చేసుకోవడానికి మంత్రి ఎలాంటి పన్నాగాలు పన్నాడు. వరద, గజపతి మధ్య ఈ భూమి, డబ్బు ఎలాంటి చిచ్చు పెట్టింది? ఈ సమస్యలకు పరిష్కారం ఎలా దొరికింది అన్నదే కథ.
విశ్లేషణ:
ఓ ఊరు, అక్కడి గ్రామ దేవత దేవాలయం, ఆ ఆలయ భూములు, వాటిపై కన్నేసిన మినిస్టర్.. వాటిని రక్షించడం కోసం జరిగిన యుద్దమే ఈ చిత్రం. తమిళంలో హిట్టైన గరుడన్ కు రీమేక్ గా వచ్చిన చిత్రమిది. రీమేక్ ను జనరంజకంగా మలచాలంటే ఏ దర్శకుడికైనా సవాల్ తో కూడిన పనే. మార్పులు, చేర్పుల విషయంలో ఏమాత్రం తేడా వచ్చినా కంపేరిజన్స్ తో మొదటికే మోసం వస్తుంది. అన్నింటిని కరెక్ట్గా బ్యాలెన్స్ చేస్తేనే రిజల్ట్ కరెక్ట్ గా ఉంటుంది. ఆరంభం కాస్త బోరింగ్గా అనిపించినా అసలు కథలోకి వెళ్లాక ఆసక్తి పెరుగుతుంది. వరదా, గజపతిల మధ్య స్నేహం వైరానికి దారితీసిన వైనం, మధ్యలో శ్రీను పడ్డ యాతన… వీటన్నింటినీ దర్శకుడు ఆసక్తిగా మలిచాడు. ఇంటర్వెల్ ఎపిసోడ్ లో వచ్చే యాక్షన్ సీన్స్, బెల్లకొండ శ్రీను ఉగ్రరూపం దాల్చి చేసిన తాండవం ఆసక్తిగా ఉంటుంది. ద్వితీయార్థంలో గజపతి స్వార్థం బయటపడటం, వరదతో గొడవ.. ఈ నేపథ్యంలో వచ్చే సీన్స్ అన్నీ బాగానే తీశారు. కానీ ఫ్రెండ్స్ మధ్య బాండింగ్ ఇంకాస్త బలంగా చూపించి ఉంటే బావుండేది. తమిళంలో రా అండ్ రస్టిక్ గా ఉన్న సినిమాను తెలుగులో యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో మలిచారు. హీరోల క్యారెక్టర్స్ ఎలివేషన్స్ బాగా ప్లాన్ చేశాడు. ముగ్గురు హీరోల్లో ఒకరు ఎక్కువ.. ఒకరు తక్కువ అనే భావన రాకుండా సమపాళ్లల్లో క్యారెక్టర్స్ రాసుకున్నాడు దర్శకుడు. తమిళంలో చూసిన వాళ్లకు ఈ సినిమా పెద్ద సర్ప్రైజ్గా ఉండదు. కొత్తగా చూసినవారికి మాత్రం క్యారెక్టర్స్ సర్ప్రైజ్ చేస్తాయి. భావోద్వేగంతో నిండిన కథ అయినా ఎక్కడో ఎమోషన్స్ కొంచెం మిస్ అయిన ఫీలింగ్ వస్తుంది..
ఇక నటీనటుల విషయానికొస్తే… నారా రోహిత్, మంచు మనోజ్, బెల్లంకొండ శ్రీను ముగ్గురికి దర్శకుడు మంచి ఎలివేషన్ ఇచ్చాడు. సినిమా కూడా గ్రాండియర్ గా ఉంది. బెల్లంకొండ శ్రీను ఇంతకు ముందు చేసిన పాత్రలకు భిన్నంగా ఉంది. ఇక పూనకం ఎపిసోడ్స్ చక్కగా రక్తి కట్టించాడు. నారా రోహిత్ డీసెంట్ క్యారెక్టర్ లో సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ అందించాడు. వరద పాత్రను తను తప్ప వేరే ఎవరూ చేయలేరనే విధంగా చేశాడు మంచు మనోజ్. ఆ పాత్రలో రౌద్రం, డైలాగ్ డెలివరీ, మేనరిజం అన్నీ ఆకట్టుకునేలా ఉండి… తన డైలాగ్ డెలివరీ మోహన్ బాబును గుర్తుకు తెచ్చింది. శ్రీను వెన్నెల (అదితి శంకర్) మధ్య లవ్ ట్రాక్ అతకపోయినా పాటలు వాటి చిత్రీకరణ బాగుంది. దివ్య పిళ్లై, ఆనంది, అజయ్, తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. వెన్నెల కిశోర్ పాత్ర అంతగా పండలేదు. ఇప్పటి వరకూ థ్రిల్లర్ చిత్రాలకు ఎక్కువగా సంగీతం అందిస్తూ వచ్చిన శ్రీచరణ్ పాకాల రూట్ మార్చి పక్కా మాస్ మసాలా సినిమాకు సంగీతం అందించాడు. క్యారెక్టర్స్, వాటి ఎలివేషన్ కు సరిపడేలా ఆర్ఆర్ ఇచ్చాడు. సినిమాటోగ్రఫీ బావుంది. ఫస్టాఫ్ కు కొద్దిగా కత్తెర వేసుంటే బావుండేది. కె.కె.రాధామోహన్ నిర్మాణ విలువలు బావున్నాయి. ఒరిజినల్ చూసిన వారిని పక్కన పెడితే మిగిలిన వారిని సినిమా మెప్పిస్తుంది. నారా రోహిత్, మంచు మనోజ్, బెల్లంకొండ శ్రీనివాస్ నటన కోసం తప్పక చూడవచ్చు.
ట్యాగ్ లైన్ : ‘భైరవం’.. స్నేహితుల రణం…
రేటింగ్: 2.75 / 5