Film Awards: ప్రతిభావంతులకు ప్రత్యేక అవార్డులు
ABN, Publish Date - May 31 , 2025 | 04:27 AM
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1996లో ఎన్టీఆర్ గౌరవార్థం ఎన్టీఆర్ నేషనల్ అవార్డ్ను ప్రారంభించింది. ఇటీవల, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అవార్డులను పునరుద్దరించి, కొత్త అవార్డులను కూడా ప్రకటించింది.
భారతీయ చిత్రపరిశ్రమకు విశిష్ట సేవలు అందించిన ప్రముఖులకు మహానటుడు ఎన్టీఆర్ గౌరవార్థం ఎన్టీఆర్ నేషనల్ అవార్డ్ను 1996లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. విభజన జరిగి రెండు రాష్ట్రాలుగా ఏర్పడే వరకూ ఈ అవార్డ్ ఇస్తూ వచ్చారు. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు అవార్డుల మీద దృష్టి పెట్టలేదు. మళ్లీ ఇన్నాళ్లకు ప్రజా గాయకుడు గద్దర్ పేరుతో సినీ అవార్డులు ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వచ్చి, అవార్డులను ప్రకటించింది. వాటితో పాటు ఎన్టీఆర్ జాతీయ పురస్కారం, రఘుపతి వెంకయ్య అవార్డ్, బీఎన్ రెడ్డి అవార్డ్, నాగిరెడ్డి-చక్రపాణి అవార్డులను పునరుద్దరించింది. వీటితో పాటు కొత్తగా పైడి జైరాజ్ పేరుతో, కాంతారావు పేరుతో మరో రెండు అవార్డులను కొత్తగా ప్రవేశపెట్టింది.
సెన్సిబుల్ డైరెక్టర్కు పైడి జైరాజ్ అవార్డ్
తెలంగాణలో పుట్టి, భారతీయ చిత్ర పరిశ్రమలో అగ్రస్థాయికి ఎదిగి, తెలంగాణ కీర్తిని జాతీయ స్థాయిలో చాటి చెప్పిన గొప్ప నటుడు, కరీంనగర్ వాసి పైడి జైరాజ్. భారతీయ సినిమా తొలి దశలో ప్రారంభమైన మూకీల నుంచి టాకీల వరకూ సాగిన పైడి జైరాజ్ ప్రస్థానం ప్రశంసనీయం. భారతీయ సినిమా తెరపై తొలి యాక్షన్ హీరో ఆయనే కావడం విశేషాంశం. తెలంగాణకు ఎంతో ఖ్యాతి తెచ్చిన ఆ గొప్పనటుడు పేరుతో ఏర్పాటు చేసిన ఫిల్మ్ అవార్డ్ను తొలిసారిగా తమిళ దర్శకుడు మణిరత్నం అందుకోనున్నారు. సెన్సిబుల్ డైరెక్టర్గా పేరొందిన మణిరత్నం కీర్తి కిరీటంలో ఈ అవార్డ్ మరో కలికితురాయి.
సుకుమార్కు ఈ అవార్డ్ చాలా ప్రత్యేకం
తెలుగుతనాన్ని, వాస్తవికతను, మధ్యతరగతి జీవితాలను ప్రతిబింబించే చిత్రాలను రూపొందించిన కళాత్మక దర్శకుడు బి.ఎన్.రెడ్డి. మూడు పదుల సినీ జీవితంలో ఆయన తీసినవి 11 చిత్రాలే. అయినా ప్రతి ఒక్క సినిమా ప్రేక్షకుల మనసుల్ని తాకింది. అటువంటి గొప్ప దర్శకుని పేరు మీద ఏర్పాటు చేసిన అవార్డ్ ను మరో గొప్ప దర్శకుడు సుకుమార్కు అందజేస్తున్నారు. పటిష్టమైన స్ర్కీన్ప్లేతో కథను నడిపించడమే కాకుండా స్టార్ హీరోలను డీ గ్లామరైజ్డ్ పాత్రల్లో చూపించి పాన్ ఇండియా స్థాయికి ఎదిగిన సుకుమార్ దర్శకత్వం వహించిన ‘రంగస్థలం’, ‘పుష్ప’ చిత్రాలు కూడా అవార్డుల జాబితాలో చోటు చేసుకోవడం విశేషంగా చెప్పాలి.
సాహసాల నిర్మాతకు నాగిరెడ్డి, చక్రపాణి అవార్డ్
చిత్ర పరిశ్రమలో స్నేహానికి ప్రతీకగా నిలిచిన గొప్ప వ్యక్తులు నాగిరెడ్డి, చక్రపాణి. ఒకటే మాట, ఒకటే బాట వీరిద్దరిదీ. విజయా పతాకంపై ఈ స్నేహితులిద్దరూ కలసి నిర్మించిన చిత్రాలన్నీ ఆణిముత్యాలే. వినోదం, సందేశం కలగలసిన విజయా వారి చిత్రాలు ఎన్ని సార్లు చూసినా ప్రేక్షకులకు విసుగనిపించదు. చిత్ర నిర్మాణరంగంలో ఓ ఒరవడిని ప్రవేశపెట్టిన నాగిరెడ్డి, చక్రపాణి పేరిట ఏర్పాటు చేసిన అవార్డ్ను మరో సీనియర్ నిర్మాత అట్లూరి పూర్ణచంద్రరావుకు అందజేయనున్నారు. నిర్మాతగా ఎన్నో సాహసాలు, ప్రయోగాలు చేసిన పూర్ణచంద్రరావు మురళీమోహన్, గిరిబాబులను చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు.
కత్తివీరుడి స్మారక అవార్డ్ విజయ్ దేవరకొండకు
జానపద చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరై ‘కత్తి వీరుడు’గా పేరు తెచ్చుకున్న కాంతారావు పేరిట ఓ ప్రత్యేక అవార్డ్ను తెలంగాణ ప్రభుత్వం తొలిసారిగా ప్రవేశ పెట్టింది. ఈ అవార్డును తెలంగాణ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దేవరకొండకు అందజేయనున్నారు.
యండమూరికి విశిష్ట పురస్కారం
తెలుగు సినిమా పితామహుడిగా ప్రఖ్యాతి పొందిన రఘుపతి వెంకయ్య పేరు మీద ఏర్పాటు చేసిన అవార్డ్ను ఈసారి ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్కు అందజేయనున్నారు. ఎన్నో చిత్రాలకు కథలు అందించిన యండమూరి రెండు చిత్రాలకు దర్శకత్వం వహించారు కూడా.