Bollywood: ప్రముఖ దర్శకుడు పార్థో ఘోష్ కన్నుమూత
ABN , Publish Date - Jun 10 , 2025 | 10:54 AM
ప్రముఖ హిందీ, బెంగాలీ చిత్రాల దర్శకుడు పార్థో ఘోష్ 76 సంవత్సరాల వయసులో గుండెపోటుతో మరణించారు. '100 డేస్, అగ్నిసాక్షి, దలాల్' వంటి చిత్రాలు ఆయనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి.
తెరకెక్కించిన చిత్రాలు దాదాపు పదిహేనే అయినా... మేకర్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు పార్థో ఘోష్. 1949 జూన్ 8న పశ్చిమ బెంగాల్ లోని కోల్ కతాలో జన్మించిన ఆయన బెంగాలీ, హిందీ చిత్రాల రూపకర్తగా ఆ రంగాలపై తనదైన ముద్రను వేశారు. 77వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన మర్నాడే పార్ధో ఘోష్ గుండెపోటుతో కన్నుమూశారు. తమిళ చిత్రం 'నూరవత్తు నాల్'ను పార్థో ఘోష్ హిందీలో 1991లో '100 డేస్' పేరుతో రీమేక్ చేశారు. జాకీష్రాఫ్, మాధురీ దీక్షిత్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా ఘన విజయాన్ని సాధించింది. ఆ తర్వాత ఆయన రూపొందించిన 'దలాల్' చిత్రం సైతం మంచి విజయాన్ని అందుకుంది. 1994లో మిధున్ చక్రవర్తితో తీసిన 'తీస్రా కౌన్' సినిమా గ్రాండ్ విక్టరీ సాధించింది. ఇది మలయాళ చిత్రం 'నెం. 20 మద్రాస్ మెల్' మూవీకి రీమేక్. 1996లో పార్థో ఘోష్ రూపొందించిన 'అగ్నిసాక్షి' చిత్రం సైతం ఘన విజయం సాధించింది. జాకీ ష్రాఫ్, నానా పటేకర్, మనీషా కొయిరాలా ఇందులో కీలక పాత్రలు పోషించారు.
పార్థో ఘోష్ రూపొందించిన 'జీవన్ యుద్థ్, గులామ్ ఎ ముస్తఫా, కౌన్ సచ్చా కౌన్ ఝూటా', 'యుగ పురుష్' వంటి చిత్రాలు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఆ తర్వాత తీసిన చిత్రాలు పెద్దంత విజయాన్ని సాధించలేదు. 2010లో ఆయన 'రెహ్మత్ అలీ', 'ఏక్ సెకండ్... జో జిందగీ బదల్ దే?' చిత్రాలను రూపొందించారు. చివరగా పార్థో ఘోష్ 'మౌసమ్ ఇకరార్ కె దో పల్ ప్యార్ కె' చిత్రాన్ని 2018తో తెరకెక్కించారు. ప్రస్తుతం తనకు బాగా పేరు తెచ్చిపెట్టిన 'అగ్నిసాక్షి', '100 డేస్' మూవీస్ కు సీక్వెల్స్ తీసే పనిలో పార్థో ఘోష్ పడ్డారు. ఈ రెండు సినిమాలను వచ్చే యేడాది విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ లోగా గుండెపోటుకు గురైన పార్థో ఘోష్ తుది శ్వాస విడిచారు. ఆయన మృతికి పలువురు సినీ ప్రముఖులు ప్రగాఢ సంతాపం తెలిపారు.
Also Read: Hit -3: టీవీల్లో రాబోతున్న నాని వయొలెంట్ మూవీ!
Also Read: NTR - War 2: పాత్రలోని స్వభావాన్ని ప్రతిబింబించేలా లుక్స్...
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి