Ranbir Kapoor: రాముడి పారితోషికం ఎంత
ABN , Publish Date - Jul 08 , 2025 | 04:41 AM
రణ్బీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతగా, యశ్ రావణుడిగా నటిస్తున్న రామాయణ చిత్రం ఫస్ట్ లుక్ ఇటీవల విడుదలై అందరినీ ఆకట్టుకుంది.
రణ్బీర్ కపూర్ శ్రీరాముడిగా, సాయి పల్లవి సీతగా, యశ్ రావణుడిగా నటిస్తున్న ‘రామాయణ’ చిత్రం ఫస్ట్ లుక్ ఇటీవల విడుదలై అందరినీ ఆకట్టుకుంది. ముఖ్యంగా ఇందులో విఎఫ్ఎక్స్ వర్క్ అద్భుతంగా ఉండబోతుందని ఈ సినిమా గ్లింప్స్ చూడగానే అందరికీ అర్థమైంది. మరో విషయం ఏమిటంటే రూ. 1600 కోట్ల బడ్జెట్తో రూపుదిద్దుకుంటున్న అత్యంత భారీ చిత్రం ఇది. ఈ సినిమాలో రాముడిగా నటిస్తున్న రణ్బీర్ కపూర్ పారితోషికం ఎంతో తెలుసా?.. రూ .150 కోట్లు. రెండు భాగాలుగా రూపుదిద్దుకుంటున్న ‘రామాయణ’ కోసం ఆయన అడిగిన పారితోషికం ఇచ్చి వర్క్ చేయించుకుంటున్నారు నిర్మాత నమిత్ మల్హోత్రా. ఇక సీతగా నటిస్తున్న సాయిపల్లవికి రెండు భాగాలకు కలిపి రూ. 12 కోట్లు ఇస్తున్నారు. రావణుడిగా నటిస్తున్న యశ్ ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వామి కనుక ఖర్చులకు తప్ప పారితోషికంగా ఏమీ తీసుకోవడం లేదు.
అప్పుడు రాముడు.. ఇప్పుడు దశరథుడు
రామానంద సాగర్ రూపొందించిన ‘రామాయణ్’ సీరియల్లో అరుణ్ గోవిల్ శ్రీరాముడిగా, దీపిక సీతగా నటించి కోట్లాది మంది హృదయాల్లో సుస్థిర స్థానం ఏర్పరచుకున్నారు. 1987లో ఆ సీరియల్ వచ్చింది. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ‘రామాయణ’ చిత్రంలోనూ అరుణ్ గోవిల్ నటిస్తున్నారు. ఈసారి ఆయన దశరధుడి పాత్ర చేస్తుండడం గమనార్హం.