Ramayanam: రామాయణ్.. ప్రపంచానికి ఇచ్చే బహుమతి
ABN , Publish Date - Jul 01 , 2025 | 05:15 PM
బాలీవుడ్ అగ్ర నిర్మాతలతో కలిసి అల్లు అరవింద్ ‘రామాయణ’ చిత్రం తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. నితేశ్ తివారీ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది
బాలీవుడ్ అగ్ర నిర్మాతలతో కలిసి అల్లు అరవింద్ (Allu Aravind) ‘రామాయణ’ (Ramayana) చిత్రం తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. నితేశ్ తివారీ (Nitesh Tiwari) దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. షూటింగ్ చాలావరకే పూర్తయినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకు సంబంధించి అధికారి ప్రకటించిన రోజు నుంచి ఏ వార్త వచ్చినా వైరల్ అవుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ భారీ ఈవెంట్ను జులై 3న ఏర్పాటు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అందులో టైటిల్ గ్లింప్స్ను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ ఈవెంట్కు టీమ్ మొత్తం హాజరుకానున్నారు. బెంగళూర్లో జరగనున్న ఈ కార్యక్రమం కోసం తారలంతా అక్కడికి బయల్దేరుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రెండు భాగాలుగా ఈ చిత్రం తెరకెక్కుతున్న ఈ చిత్రం మొదటి పార్ట్ షూటింగ్ కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. ఆ వీడియోలు కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోల్లో టీమ్ అందరికీ రణ్బీర్ కపూర్, నితేశ్ తివారీలు ధన్యవాదాలు చెబుతూ కనిపిస్తున్నారు. ఈ సినిమా మొదటి భాగాన్ని 2026 దీపావళికి, రెండో భాగం 2027 దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఇందులో రాముడి పాత్రలో రణ్బీర్ కపూర్, సీతగా సాయి పల్ల్లవి, రావణుడిగా యశ్, హనుమంతుడిగా సన్నీదేవోల్ నటిస్తున్నారు.
నిర్మాత నమిత్ మల్హోత్ర మాట్లాడుతూ ‘‘ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులందరికీ ఒక సాంస్కృతిక సమ్మేళనమైన కథ. రామాయణంతో మేం చరిత్రను చెప్పడం లేదు. ఆ చరిత్రకున్న లెగసీని ప్రపంచానికి పరిచయం చేస్తున్నాము. ఈ కథ, దానిలోని భావోద్వేగాలను, ఇప్పటి టెక్నాలజీతో ప్రపంచానికి చెప్పబోతున్నాం. రామాయణాన్ని ఇంతకు ముందు కూడా సినిమాలుగా చూశాం. కానీ లేటెస్ట్ వెర్షన్లో ప్రకృతి దృశ్యాలు, జీవులు, యుద్ధాలు మరింత గొప్పగా చూపించబోతున్నాం. భారతీయులుగా ఇది రామాయణ ఇతిహాసం నిజం. ఇప్పుడు అది ప్రపంచానికి మనమిచ్చే బహుమతి అవుతుంది’’ అని అన్నారు.
దర్శకుడు నితేష్ తివారీ మాట్లాడుతూ ‘‘రామాయణం అనేది మనందరికీ తెలిసిన కథ. ఇది మన సంస్కృతి యొక్క విశిష్టతను చెబుతుంది. ఆ సంప్రదాయాన్ని గౌరవించడం మన కర్తవ్యం. ఆ ఇతిహాసం పేరును ఎక్కడా చెడగొట్టకుండా సినిమాటిక్ స్కేల్తో దానిని తెరపై ప్రదర్శించడం మా లక్ష్యం. ఈ తరహా కథకు జీవం పోయడం పెద్ద బాధ్యత. ఇది వేల సంవత్సరాలుగా ఉన్న కథ. మేము కేవలం సినిమా తీయడం లేదు. ఓ భక్తి వాతావరణాన్ని సృష్టించబోతున్నాం’’ అని అన్నారు.