Akshay Kumar: 700 మంది స్టంట్ మాస్టర్లకు ఇన్స్యూరెన్స్.. రియల్ హీరో అనిపించుకున్న అక్షయ్ కుమార్
ABN, Publish Date - Jul 18 , 2025 | 09:06 AM
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తన గొప్ప మనసు మరోసారి చాటుకున్నారు.
బాలీవుడ్ (Bollywood) స్టార్ హీరో అక్షయ్ కుమార్ (Akshay Kumar) తన గొప్ప మనసు మరోసారి చాటుకున్నారు. మన దేశంలో క్రైసిస్ వచ్చిన ప్రతీ సమయంలో అందరి కన్నా ముందుగా స్పందిస్తూ భారీగా విరాళాలు ఇచ్చే ఆయన తాజాగా మరోసారి తన ఉదారతను నిరూపించుకున్నాడు. ఇటీవల తమిళనాడులో ఆర్య నటిస్తున్న ఓ సినిమా చిత్రీకరణ సమయంలో జరిగిన ప్రమాదంలో రాజు అనే ఓ స్టంట్ మాస్టర్ మరణించిన విషయం తెలిసిందే. ఈ విషయం అక్షయ్ కుమార్ వరకు చేరడంతో అతను చలించి పోయాడు. ఈ క్రమంలో.. వారికి భరోసా కల్పించేందుకు ముందుకు వచ్చారు.
యాక్షన్ సీన్లలో ప్రాణాలను పణంగా పెట్టి పనిచేసే స్టంట్ మాస్టర్స్ (Stunt Masters) కోసం ఆయన తీసుకున్న నిర్ణయం ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన దేశ వ్యాప్తంగా ఉన్న దాదాపు 650-700 మంది స్టంట్ మాస్టర్స్కి వ్యక్తిగత ఇన్స్యూరెన్స్ సదుపాయం అందించారు. ఈ ఇన్స్యూ రెన్స్లో ఆరోగ్య సమస్యలకు రూ.5 లక్షలు, మరణించిన సందర్భంలో కుటుంబానికి రూ.20-25 లక్షల వరకూ భద్రత కల్పించే పాలసీని ఏర్పాటు చేశారు. ఈ పాలసీని యాక్షన్ డైరెక్టర్స్ గిల్డ్ మరియు స్టంట్ ఆర్టిస్ట్ యూనియన్ సమన్వయంతో అమలు చేయనున్నారు. ఈ విషయాన్ని యాక్షన్ కోరియో గ్రాఫర్ విక్రమ్ సింగ్ దహియా ప్రకటించడం విశేషం.
ఇదిలాఉంటే.. అక్షయ్ కుమార్ కెరీర్ కూడా చెప్పుకోవాలంటే భారతీయ సినీ పరిశ్రమలో అత్యధిక యాక్షన్ సినిమాలు చేసిన హీరోల్లో అక్షయ్ కుమార్ ముందు వరుసలో ఉంటారు. తన కెరీర్లో ఎన్నో ప్రమాదకరమైన స్టంట్లు స్వయంగా చేసి చూపించిన ఆయనకు స్టంట్ ఆర్టిస్టుల కష్టం బాగా తెలుసు. అందుకే ఆయన తాజాగా జరిగిన దుర్ఘటన విషయం ఆయన దృష్టికి రాగానే ఆలోచించకుండా వెను వెంటనే 650 నుంచి 700 మంది స్టంట్ మాస్టర్స్కు హెల్త్ అండ్ యాక్షిడెంట్ ఇన్స్యూరెన్స్ అందించారు. అక్షయ్ కుమార్ ఎంతో డేరింగ్గా తీసుకుని అమలు చేసిన ఈ నిర్ణయాన్ని సినిమా పరిశ్రమలోని చాలా మంది ప్రముఖులు, స్టంట్ మాస్టర్స్ ప్రశంసిస్తున్నారు.