Drugs Case: పోలీసు విచారణలో క్రిష్‌!.. రాడిసన్‌లోని జంట గదులపై ఫోకస్‌

ABN , Publish Date - Feb 28 , 2024 | 10:53 AM

రాడిసన్‌ హోటల్‌లో డ్రగ్స్‌ వ్యవహారంలో సినీ దర్శకుడు జాగర్లమూడి క్రిష్‌ బుధవారం పోలీసుల విచారణకు హాజరుకానున్నారు. ప్రధాన నిందితుడు వివేకానంద వాంగ్మూలం మేరకు.. పోలీసులు క్రిష్‌ పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. ఈ నేపథ్యంలో దర్యాప్తు అధికారులు మంగళవారం క్రిష్‌తో ఫోన్‌లో మాట్లాడారు. విచారణకు హాజరవ్వాలని, ఈ కేసు దర్యాప్తునకు సహకరించాలని కోరారు.

Drugs Case: పోలీసు విచారణలో క్రిష్‌!.. రాడిసన్‌లోని జంట గదులపై ఫోకస్‌
Director Krish

రాడిసన్‌ హోటల్‌లో డ్రగ్స్‌ వ్యవహారంలో సినీ దర్శకుడు జాగర్లమూడి క్రిష్‌ (Krish Jagarlamudi) బుధవారం పోలీసుల విచారణకు హాజరుకానున్నారు. ప్రధాన నిందితుడు వివేకానంద వాంగ్మూలం మేరకు.. పోలీసులు క్రిష్‌ (Krish) పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. ఈ నేపథ్యంలో దర్యాప్తు అధికారులు మంగళవారం క్రిష్‌తో ఫోన్‌లో మాట్లాడారు. విచారణకు హాజరవ్వాలని, ఈ కేసు దర్యాప్తునకు సహకరించాలని కోరారు. అయితే.. తాను బయట ఉన్నానని, బుధవారం విచారణకు వస్తానని క్రిష్‌ చెప్పినట్లు సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌ మహంతి ‘ఆంధ్రజ్యోతి’ (Andhrajyothy)కి తెలిపారు. ‘‘క్రిష్‌ను విచారిస్తాం. వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత.. తదుపరి చర్యలు ఉంటాయి. ఇప్పటి వరకు క్రిష్‌ ఈ కేసులో అనుమానితుడు మాత్రమే. నేరం చేశారా? లేదా? అనేది తేలాల్సి ఉంది’’ అని ఆయన వివరించారు. ఈ కేసులో ఏపీకి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త ఒకరు ఉన్నట్లు సమాచారం. గతంలో రాడిసన్‌లో జరిగిన డ్రగ్స్‌ పార్టీల్లో ఆయన పాల్గొన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే.. దర్యాప్తు అధికారులు ఈ విషయాన్ని ఇంకా ధ్రువీకరించలేదు. క్రిష్‌తోపాటు.. లిషి గణేశ్‌ పేర్లు వెలుగులోకి రావడంతో.. తాజా ఘటన మరోసారి టాలీవుడ్‌ను ఉలిక్కిపడేలా చేసింది. (Radisson Blu Drugs Case)

ఈ కేసులో మొత్తం పది మంది ఉన్నట్లు ఎఫ్‌ఐఆర్‌ స్పష్టం చేస్తుండగా.. వివేకానంద, అతనికి డ్రగ్స్‌ సరఫరా చేసే అబ్బాస్‌, కేదార్‌, నిర్భయ్‌లను పోలీసులు అరెస్టు చేశారు. కేదార్‌, నిర్భయ్‌లకు నార్కోటిక్స్‌ పరీక్షలు నిర్వహించగా.. పాజిటివ్‌ అని తేలినట్లు మాదాపూర్‌ డీసీపీ వినీత్‌ తెలిపారు. మిగతా ఆరుగురు పరారీలో ఉన్నారు. వీరంతా నగరంలోనే ఉన్నారా? అనేదానిపై పోలీసులు దృష్టి సారించారు. వీరిలో.. క్రిష్‌తోపాటు.. సెలబ్రిటీలు శ్వేత, నీల్‌, సినీనటి లిషి, సందీప్‌, రఘుచరణ్‌ ఉన్నారు. వీరిని పట్టుకునేందుకు గచ్చిబౌలి, ఎస్‌వోటీ పోలీసులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు డీసీపీ చెప్పారు. వారు డ్రగ్స్‌ తీసుకున్నారా? లేదా? అనేదాన్ని బట్టి కేసు దర్యాప్తులో పురోగతి ఉంటుందని వివరించారు. అబ్బాస్‌ అనే డ్రగ్‌ పెడ్లర్‌ గతంలో మంజీరా గ్రూప్‌లో పనిచేశాడని, అప్పటి నుంచే వివేకానందకు అతనితో పరిచయం అని పోలీసులు తెలిపారు. వివేకానందకు అతను 10 సార్లు డ్రగ్స్‌ను సరఫరా చేశాడని వెల్లడించారు. కాగా.. తనపేరు బయటకు రావడంపై క్రిష్‌ స్పందించారు. తాను ఆరోజు రాడిసన్‌ హోటల్‌కు వెళ్లింది నిజమేనని, ఓ అరగంట ఉండి.. సాయంత్రం 6.45కు బయటకు వచ్చానని వివరించారు. ఈ క్రమంలో వివేకానందతో కాసేపు మాట్లాడానన్నారు. పోలీసుల విచారణకు హాజరవుతానని చెప్పారు.


radisson-blu-hyd.jpg

ఆ రెండు గదుల కథేంటి?

గచ్చిబౌలిలోని రాడిసన్‌ యజమాని వివేకానంద ఆ హోటల్‌ 12వ అంతస్తులోని 1200, 1204 నంబర్‌ ఉన్న గదులను సొంత పార్టీల కోసం కేటాయించినట్లు పోలీసులు భావిస్తున్నారు. ‘‘బయటి నుంచి చూస్తే.. ఇవి వేర్వేరు గదులు. లోపల మాత్రం రెండు గదులకు మధ్య ద్వారం ఉంటుంది’’ అని పోలీసులు వివరించారు. ఈ గదుల్లోనే డ్రగ్స్‌ పార్టీలు జరిగేవని గుర్తించామన్నారు. గతంలో ఎప్పుడెప్పుడు పార్టీలను నిర్వహించారు? ఎవరెవరు ఎంత డ్రగ్స్‌ తీసుకున్నారు? అనే కోణంపై మరో బృందం దృష్టి సారించింది. ఈ కోణంలో ఇప్పటికే పలు వివరాలను సేకరించిన పోలీసులు.. ఆధారాలు లభిస్తే మరిన్ని ఎఫ్‌ఐఆర్‌లను నమోదు చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.


ఇవి కూడా చదవండి:

====================

*Dil Raju: ‘లవ్ మీ’ కథ వినగానే.. ‘ఆర్య’కు ఎలా ఎగ్జైట్ అయ్యానో.. అలా ఎగ్జైట్ అయ్యా..

**************************

*Ester Noronha: 10 సంవత్సరాల క్రితం మొదటి హిట్, అసలు విషయం చెప్పేసిన ఎస్తర్..

********************************

*Mahesh Babu: మల్టీప్లెక్స్‎ల బాట పట్టిన సూపర్ స్లార్లు.. ఏకంగా అక్కడ థియేటర్ ఓపెన్ చేస్తోన్న మహేశ్ బాబు

**************************

Updated Date - Feb 28 , 2024 | 11:02 AM