Breaking: మొదటి సినిమా విడుదలకి ముందు.. దర్శకుడి కన్నుమూత

ABN , First Publish Date - 2023-02-27T13:00:16+05:30 IST

ఇటీవల దేశవ్యాప్తంగా ఉన్న పలు చిత్ర పరిశ్రమలకి చెందిన ప్రముఖులు వరుసగా మృత్యువాత పడుతున్నారు.

Breaking: మొదటి సినిమా విడుదలకి ముందు.. దర్శకుడి కన్నుమూత

ఇటీవల దేశవ్యాప్తంగా ఉన్న పలు చిత్ర పరిశ్రమలకి చెందిన ప్రముఖులు వరుసగా మృత్యువాత పడుతున్నారు. కొన్నిరోజుల క్రితం టాలీవుడ్‌ నటుడు తారకరత్న (Mayilsamy) మృతి చెందగా.. అనంతరం కొన్ని గంటల్లోనే తమిళ కమెడియన్ మైల్‌‌సామీ (Mayilsamy), ప్రముఖ కన్నడ దర్శకుడు ఎస్‌కే భగవాన్ (SK Bhagawan) మరణించారు. తాజాగా మలయాళ సినీ పరిశ్రమ మాలీవుడ్‌లో మరో విషాదం చోటు చేసుకుంది. నూతన దర్శకుడు జోసెఫ్‌ మను జేమ్స్‌ (Joseph Manu Jame)(31) అనారోగ్యంతో కన్నుమూశారు.

జేమ్స్ గత కొంతకాలంగా న్యూమోనియాతో బాధపడుతున్నారు. దానికి కేరళ అలువాలోని రాజగిరి ఆస్పత్రిలో చికిత్స సైతం తీసుకుంటున్నారు. ఈ తరుణంలో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించి ఫిబ్రవరి 25న తుదిశ్వాస విడిచారు. అనంతరం ఫిబ్రవరి 26న ఆయన అంత్యక్రియలు జరిగాయి. కాగా.. 2004లో వచ్చిన ‘ఐయామ్‌ క్యూరియస్‌’ మూవీతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా పరిచయమైన జేమ్స్.. కొన్నేళ్ల తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్‌గా మారి పలు మలయాళ, కన్నడ, హిందీ చిత్రాలకు పని చేశారు. ఇటీవలే ‘నాన్సీ రాణి’ అనే మలయాళ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆ మూవీ త్వరలో థియేటర్స్‌లో విడుదలకి సిద్ధమవుతోంది. ఈ తరుణంలోనే తొలి సినిమా విడుదల కాకముందే ఆయన మరణించడంతో మూవీటీం తీవ్ర విచారం వ్యక్తం చేసింది. అలాగే చిన్న వయస్సులోనే మృతి చెందిన ఆయనకి మలయాళ చిత్ర పరిశ్రమకి చెందిన పలువురు సంతాపం తెలిపారు. ఈ సినిమాలో అహానా క్రిష్ణ, అర్జున్‌ అశోకన్‌ కీలక పాత్రలు పోషించారు.

ఇవి కూడా చదవండి:

Breaking news: సినీ పరిశ్రమలో మరో విషాదం.. ప్రముఖ దర్శకుడు మృతి

#RIPMayilSamy: సినీ పరిశ్రమలో విషాదం.. తమిళ ‘సీన్ స్టీలర్’ కన్నుమూత

Updated Date - 2023-02-27T13:00:17+05:30 IST