Sugam Babu: రచయిత, జర్నలిస్ట్ సుగంబాబు ఇక లేరు

ABN , First Publish Date - 2022-10-18T22:20:48+05:30 IST

ప్రముఖ కవి, పైగంబర కవుల్లో ఒకరైన ఎం.కె. సుగంబాబు (MK Sugam Babu) మంగళవారం ఉదయం కన్నుమూశారు. ఆయన వయసు 74 సంవత్సరాలు. ఆయనకు..

Sugam Babu: రచయిత, జర్నలిస్ట్ సుగంబాబు ఇక లేరు

ప్రముఖ కవి, పైగంబర కవుల్లో ఒకరైన ఎం.కె. సుగంబాబు (MK Sugam Babu) మంగళవారం ఉదయం కన్నుమూశారు. ఆయన వయసు 74 సంవత్సరాలు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. గుంటూరుకు చెందిన సుగంబాబు రచయిత, దర్శకుడు, జర్నలిస్టు కూడా. జర్నలిజంలోకి రాకముందు సుగంబాబు మద్రాసులో మనసు కవి ఆత్రేయ (Atreya) దగ్గర, ప్రముఖ నిర్మాత ఎం.ఎస్. రెడ్డి (MS Reddy) వద్ద పనిచేశారు. కొన్ని సినిమాలకు మాటలు రచయితగానూ, దర్శకత్వ శాఖలోనూ పనిచేశారు. ఆయన ముక్కుసూటి మనిషి. ఒకరి మెప్పుకోసం ఎప్పుడూ పాకులాడ లేదు. ఎవరికి కోపాలు వచ్చినా నిజాన్ని నిర్భయంగా చెప్పడం ఆయన స్వభావం. సుగంబాబు 1984లో గురజాడ జీవిత విశేషాలతో కూడిన ‘అస్తమించిన సూర్యుడు’ (Asthaminchina Suryudu) డాక్యుమెంటరీకి.. 1985లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బంగారు నందితో సత్కరించింది.


సుగంబాబు ‘రెక్కలు’ (Rekkalu) అనే ఒక వినూత్న సాహితీ ప్రక్రియకు ఆద్యులు. కొన్ని భాగాలుగా వెలువడిన ‘రెక్కలు’ను ఒకే సమగ్ర సంపుటంగా ప్రచురించారు. ఏ కళ అయినా దుఃఖంలోంచే పుడుతుందని, దుఃఖాన్ని పోగొట్టేందుకు దుఃఖం నుంచే రాశాననీ, ఏదీ ఊహించి రాయలేదనీ, చూసి అనుభవించి రాశాననీ సుగంబాబు పేర్కొన్నారు. ఈ సంపుటిలో... రెక్కలు, అంతర్థానం, శిఖరం, దారి, చెరుగ్గడ అనే అయిదు విభాగాలున్నాయి. ‘రెక్కలు’ కొన్ని విదేశీ భాషల్లోనూ, తమిళంలోను అనువదించబడింది.. విదేశీయులు కూడా ప్రశంసించారు. సుగంబాబు దార్శనికుడు.. తాత్వికుడు. ఆయన రచనల్లో మనకు ఈ చింతన ప్రస్ఫుటంగా కనబడుతుంది. పైగంబర కవుల్లో ఒకరైన సుగంబాబు చాలాకాలం జర్నలిస్టుగా పత్రికల్లో పనిచేశారు. ‘మయూరి’ వీక్లీలో ఆ రోజుల్లో ‘ప్రముఖుల పేజీ’ పేరుతో నిర్వహించిన శీర్షికలో నిన్నటితరం కవుల గురించి రాశారు. జీవితాంతం కవిత్వంలోనే బతికి, కవిత్వం కోసమే తపించిన కవి సుగంబాబు. ఆయన మరణం తీరని లోటుగా సాహితీ లోకం భావిస్తోంది.



Updated Date - 2022-10-18T22:20:48+05:30 IST